Begin typing your search above and press return to search.

ఏపీలోని ఆ జంట గురించి తెలిస్తే.. చచ్చినా లోన్ యాప్ లో అప్పు తీసుకోరు

By:  Tupaki Desk   |   8 Sep 2022 5:30 AM GMT
ఏపీలోని ఆ జంట గురించి తెలిస్తే.. చచ్చినా లోన్ యాప్ లో అప్పు తీసుకోరు
X
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనంతనే అప్పు తీసుకోవటం మామూలే. అయితే.. ఈ అప్పు కోసం ఇబ్బందులు తప్పవు. కొందరు స్నేహితుల్నిఆశ్రయిస్తే.. మరికొందరు బంధువుల్ని అడిగి తీసుకుంటారు.ఇంకొందరు మాత్రం తాకట్టు పెట్టటం కానీ.. బ్యాంకులోకానీ అప్పు తీసుకుంటారు. అయితే.. ఇటీవల పెరిగిన మొబైల్ వాడకం తర్వాత.. ఆన్ లైన్ లో ముక్కు ముఖం తెలీకున్నా.. ఇట్టే అప్పులు ఇచ్చే వారి మాయాజాలంలో పడిపోయి.. భారీగా మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

మిగిలిన అప్పులకు భిన్నంగా ఈ లోన్ యాప్ లో అప్పు తీసుకునే వారి నుంచి సదరు సంస్థలు భారీ మొత్తాల్ని వసూలు చేయటం..ఒకసారి ఆ ఉచ్చులో చిక్కుకుంటే మళ్లీ అందులో నుంచి బయటకు రాలేని రీతిలో ఇరుక్కుపోయేలా చేసే టాలెంట్ సదరు సంస్థల సొంతం. అంతేకాదు.. అప్పు తీసుకొని వారు చెప్పినంత చెల్లించకపోతే.. బంధువులకు.. స్నేహితులకు ఫోన్లు చేయటం.. అప్పు తీసుకునే వారి గురించి తప్పుడు మాటలు చెప్పటం.. మార్ఫింగ్ ఫోటోల్ని పంపటం లాంటివెన్నో చేస్తుంటారు. ఇలాంటి వేధింపులకు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకోవటం తెలిసిందే.

తాజాగా అలాంటి ఉదంతమే అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగిలో చోటు చేసుకుంది. 32 ఏళ్ల దుర్గాప్రసాద్.. 24 ఏళ్ల రమ్యలక్ష్మిలు ఇద్దరు దంపతులు. వీరికి మూడేళ్ల.. రెండేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గా ప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్ గా పని చేస్తుంటే.. రమ్యలక్ష్మి మిషన్ కుడుతుంటారు. కొంతకాలంగా వీరు రాజమహేంద్రవరంలో ఉంటున్నారు.

ఇంటి అవసరాల కోసం ఎవరినో ఎందుకు అప్పు అడగటం ఎందుకని.. లోన్ యాప్ ద్వారా రుణాన్ని తీసుకున్నారు. తీసుకున్న మొత్తాన్ని చెప్పిన సమయానికి కట్టకపోవటంతో వడ్డీ భారీగా పెరిగిపోయింది. లోన్ యాప్ కు సంబంధించిన టెలీకాలర్స్ వారిని తరచూ ఫోన్లు చేసి వేధించేవారు.

ఇద్దరి న్యూడ్ ఫోటోలు తమ వద్ద ఉన్నాయని.. అప్పు మొత్తాన్ని చెల్లించకపోతే వాటిని బయటపెడతామన్న బెదిరింపులతో పాటు.. స్నేహితులకు.. బంధువులకు ఫోన్ చేసి వారు తీసుకున్న అప్పు గురించి చెప్పుకొచ్చారు. దీంతో.. పరువు పోయిందని వేదన చెందిన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.

పిల్లల్ని ఇంట్లో వదిలేసి లాడ్జిలో రూం తీసుకొని పురుగుల మందు తాగిన వారు.. తెలిసిన బంధువులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో వారు ఉరుకులు పరుగుల మీద లాడ్జి వద్దకు వచ్చి.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారిద్దరు చనిపోయారు. ఈ ఘటనపై దుర్గాప్రసాద్ సోదరుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.