Begin typing your search above and press return to search.

అక్కడ దీపావళి దాటేదాకా.. బాణసంచా కాలిస్తే ఆరేళ్ల జైలు

By:  Tupaki Desk   |   10 Nov 2020 9:45 AM IST
అక్కడ దీపావళి దాటేదాకా.. బాణసంచా కాలిస్తే ఆరేళ్ల జైలు
X
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) కొన్ని రోజులుగా తెలుపుతోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలిలో నాణ్యత చాలా వరకు పడిపోయింది. అలీపూర్‌లో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 432, ముండ్కాలో 427, వజీపూర్‌లో 409 నమోదైంది. గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరుగడంతో ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొంటున్నారు. పిల్లలైతే గొంతు సమస్యలతో బాధపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో నవంబర్ 30 వరకు బాణాసంచా కాల్చడంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది. దీనిపై ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు.జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఉల్లంఘించే ఢిల్లీలో ఎవరైనా బాణసంచా కాలుస్తూ ఆరేళ్ల జైలు శిక్ష పాటు రూ.లక్ష జరిమానా కూడా తప్పదని హెచ్చరించారు. నవంబర్ 14న దీపావళి జరుపుకోనున్న నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ బాణసంచాపై నిషేధం విధించడంతో అక్కడ పండగ సమయంలో ఎవరూ టపాసులు కాల్చడానికి అవకాశం లేకుండా పోయింది. కనీసం పండగ సమయంలో టపాసులు కాల్చే అవకాశం లేకుండా పోయిందని కొందరు అంటుండగా, ఇప్పటికే వాయు కాలుష్యం అధికమైన నేపథ్యంలో ఎన్జీటీ సరైనదేనని మరికొందరు అంటున్నారు. కాగా ఢిల్లీ తోపాటు కాలుష్యం అధికంగా ఉండే నగరాలు పట్టణాల్లో నవంబర్ 30వ తేదీ వరకు బాణసంచా కాల్ చేయడంపై ఎన్జీటీ నిషేధం విధించింది. దీంతో ప్రభుత్వం కూడా బాణసంచా కాల్చిన వారికి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది.