Begin typing your search above and press return to search.

జేసీ బ్రదర్స్ ఒత్తిడికి బాబు తలొంచక తప్పలేదట

By:  Tupaki Desk   |   28 Feb 2017 6:05 AM GMT
జేసీ బ్రదర్స్ ఒత్తిడికి బాబు తలొంచక తప్పలేదట
X
టీడీపీ ఎమ్మెల్సీ టిక్కెట్లను ప్రకటించడం.. అందులో అనంతపురం నుంచి దీపక్ రెడ్డి పేరు ఉండడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి అల్లుడైన దీపక్ రెడ్డి కోసం దివాకరరెడ్డి బాగా ఒత్తిడి చేశారట. ఇంతకుముందు జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా దీపక్ రెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఇప్పటికే ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యేగా - దివాకరరెడ్డి ఎంపీగా ఉండడంతో ఆ కుటుంబం నుంచే దీపక్ రెడ్డికి టిక్కెటు ఇవ్వడంపై అక్కడి పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది.

నిజానికి దీపక్ రెడ్డి ఐవీఆర్‌ ఎస్‌ పోల్‌ లో వెనకబడ్డారు. అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణులు ఆయనకు మద్దతు పలకలేదు. పదవులన్నీ జేసీ కుటుంబానికేనా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆఖరి నిమిషంలో దీపక్ రెడ్డి పేరునే ప్రకటించారు. దివాకరరెడ్డి ఒత్తిడి చంద్రబాబుపై బాగా పనిచేసిందని.. ఆయన్ను కాదంటే తరువాత ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బంది పెడతారో అన్న భయంతోనే దీపక్ రెడ్డి పేరు ప్రకటించారని అంటున్నారు.

దీపక్ రెడ్డి బిజినెస్ మేనేజ్‌ మెంట్ గ్రాడ్యూయేట్. గ్రేట్ ఇండియన్ మైనింగ్ - గ్రేట్ ఇండియా రాక్ మినరల్స్ వంటి సంస్థలకు యజమాని. 2012లో 18 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సమయంలో రాయదుర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో పార్టీ కోసం ఖర్చు చేస్తారని సర్దిచెబుతూ చంద్రబాబు ఆయనకు సీటు కేటాయించారని అనంత టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/