Begin typing your search above and press return to search.

సంచలనం.. సివిల్స్ టాపర్స్ జంట విడాకులు తీసుకున్నారు

By:  Tupaki Desk   |   21 Nov 2020 9:30 AM GMT
సంచలనం.. సివిల్స్ టాపర్స్ జంట విడాకులు తీసుకున్నారు
X
దాదాపు ఐదేళ్ల క్రితం.. 2015లో విడుదలైన సివిల్స్ ఎగ్జామ్ లో తొలి ప్రయత్నంలోనే ఫస్ట్ ర్యాంకర్ గా టీనీ దాబీ నిలవటం.. రెండో ర్యాంక్ ను సొంతం చేసుకున్న కశ్మీరీ యువకుడు అప్పట్లో వార్తల్లో నానారు. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. పలు హిందూ సంఘాలు వీరిన పెళ్లిపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండేళ్ల వైవాహిక బంధం అనంతరం తాజాగా వారిద్దరురాజస్థాన్ ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్న వైనం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

తామిద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లుగా ఈ జంట చెబుతోంది. సివిల్స్ టాపర్ అయిన దాబీ.. ఆమెకు జూనియర్ అయిన అమీర్ మధ్య ప్రేమ మొగ్గ తొడగటం.. వారిద్దరు పెళ్లి చేసుకుంటామని చెప్పటం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే.. ఇద్దరు సివిల్స్ అధికారులు కావటంతో రెండు కుటుంబాల మధ్య పెద్ద అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అయితే.. వీరి పెళ్లి విషయంపై విశ్వ హిందూ మహాసభ బాహాటంగానే అభ్యంతరం వ్యక్తం చేసింది.

సివిల్స్ టాపర్ అయి ఉండి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఏమిటని ప్రశ్నించింది. అయితే.. వీటిని పట్టించుకోకుండానే ఈ జంట పెళ్లి చేసుకున్నారు. లక్కీగా ఇద్దరు రాజస్థాన్ రాష్ట్రంలోనే పోస్టింగ్ రావటం.. ఆ తర్వాత వీరి విషయం మరుగన పడిపోయింది. పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపటం.. మనస్పర్థలు పెరగటంతో వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. ఇరు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించి కోర్టును ఆశ్రయించారు. తాజాగా వీరి పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో.. వీరి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.