Begin typing your search above and press return to search.

మోడీ గాలీ తీసేశారు

By:  Tupaki Desk   |   7 Sep 2015 9:47 AM GMT
మోడీ గాలీ తీసేశారు
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై పెట్టుకున్న అంచ‌నాల‌ను అంత‌ర్జాతీయ స‌మాజం లైట్ తీసుకుంటోందా? మోడీ మార్కెట్ మ్యాజిక్ మ్యాన్ అనుకున్న‌వాళ్ల‌కంతా ఇపుడు వాస్త‌వాలు క‌నిపిస్తున్నాయా? అవున‌నే అంటున్నారు అంత‌ర్జాతీయ వాణిజ్య దిగ్గ‌జాలు.

ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్స్‌ కుప్పకూలుతున్నాయి. ఆసియాలో చైనా తర్వాత భారీ నష్టాలు నమోదు అవుతున్న స్టాక్‌ మార్కెట్‌ భారతే. భారతీయ స్టాక్‌ మార్కెట్ చరిత్రలో 1000 పాయింట్లు కోల్పోవడం చాలా అరుదైన సంఘటన. నిఫ్టీ అలా క్షీణించటం వెనుక కారణం ఒక్కటే. అదే ఎఫ్‌ ఐఐలు అమ్మకాలే. విదేశీ ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో అమ్మకాలు చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఆగస్టులో 17వేల కోట్ల షేర్లను ఎఫ్‌ ఐఐలు అమ్మేశారు. నిఫ్టి పడిపోతున్నా.. షేర్ల ధరలు క్షీణిస్తున్నా.. ఎఫ్‌ ఐఐలు అమ్మకాలను మానడం లేదు. ఈ నేప‌థ్యంలో భారత దేశ మార్కెట్, న‌రేంద్ర మోడీ తీరుపై అంత‌ర్జాతీయంగా పేరెన్నిక‌గ‌న్న ట్రేడింగ్ గురు తీవ్ర నిరాశ వ్య‌క్తం చేశారు.

ప్రపంచ ప్రఖ్యాత‌ కమాడిటీస్‌ ట్రేడింగ్‌ గురు, హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ జిమ్‌ రోజర్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై నేరుగా త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. భారత ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్రమోడీ ఏదో చేస్తాడని ఆశించామ‌ని, అన్ని రంగాల్లో సంస్కరణలు తెస్తారని భావించామ‌ని గతం నెమ‌రు వేసుకున్నారు. అయితే ఏడాదిన్నరగా ఎదురు చూసినా.. ఎలాంటి సంస్కరణలు రాలేదని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మోడీ పబ్లిసిటీ వ్యక్తి తప్ప.. చేసేది ఏమీ లేదని తేలిందని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. భార‌త్ మార్కెట్ మారుతుంద‌నే ఆశతో ఇన్వెస్ట్‌ చేయలేమ‌ని, త‌మ వద్ద ఉన్న భారత షేర్లు అన్నీ అమ్మేసి వెళ్లిపోతున్నామని ప్ర‌క‌టించారు.

ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ లలో రఘురామ రాజన్ ఒకర‌ని రోజ‌ర్ కితాబు ఇచ్చారు. భారత ఆర్థికవ్యవస్థను ఆయ‌న కన్నా బాగా ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. అయితే మార్పు ఏదైనా రావాల్సింది ప్రభుత్వాల్లోనేన‌ని...వారేమీ చేయలేకపోతే గవర్నర్‌ ఏం చేస్తారని జిమ్‌ రోజర్స్ వ్యాఖ్యానించారు.

దీంతో, ఎఫ్‌ ఐఐలు.. భారత్‌పై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోందని ఇండస్ట్రీ అంటోంది. అయితే, ఎఫ్‌ ఐఐలు కాకుల లాంటివని, ఎక్కడ లాభాలు వస్తే.. అక్కడ వాలిపోతాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరమేలేదని ఆర్థికశాఖలోని ఉన్నతాధికారులు అంటున్నారు. వాళ్లకు లాభాలు ఎక్కడ వస్తే అక్కడ వెళ్తారని.. తాత్కాలికంగా ఉండే ఎఫ్‌ ఐఐల కోసం కీలక నిర్ణయాలు వెంటనే తీసుకోవటం కుదరదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇండియాలోని రెడ్‌ టేపిజం, ఎఫ్‌ ఐఐల మధ్య వార్.. మా ప్ర‌ధాన‌మంత్రికి చెడ్డపేరు తెస్తోందని బీజేపీ వర్గాలంటున్నాయి.