Begin typing your search above and press return to search.

అవినీతిని బ‌య‌ట‌పెట్టినందుకు సారీ చెప్పాలా?

By:  Tupaki Desk   |   31 July 2017 10:47 AM GMT
అవినీతిని బ‌య‌ట‌పెట్టినందుకు సారీ చెప్పాలా?
X
కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి - జయలలిత నెచ్చెలి శశికళ రాజభోగాల ఎపిసోడ్‌ కు తెర‌ప‌డేలా చేసిన ఆ రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ రూప మ‌రోమారు త‌న‌దైన శైలిలో రియాక్ట‌య్యారు. శశికళ కోసం జైలులో ప్రత్యేకంగా వంటగది ఏర్పాటు చేశారని, ఇందుకోసం జైళ్ల శాఖ డీజీపీ లంచం తీసుకున్నారని రూప‌ నివేదిక ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రూప కామెంట్ల నేప‌థ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, రూప‌ను క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటుగా రూ.50 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లు తేల్చిచెపుతూ నోటీసులు పంపించారు. దీంతో చిన్న‌మ్మ‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నార‌న్న నివేదిక అనంత‌రం ఆమె బదిలీ వేటు పడింది. ఆమెను ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది.

కోర్టు నోటీసులు, బ‌దిలీల నేప‌థ్యంలో తాజాగా రూప స్పందిస్తూ తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పే ప్ర‌సక్తే లేద‌ని తేల్చిచెప్పారు. ``జైళ్ల శాఖ‌లో జ‌రుగుతున్న అవినీతిని నేను బ‌య‌ట‌పెట్టాను. బాధ్య‌త క‌లిగిన అధికారిగా నా విధులు నేను నిర్వ‌ర్తించాను. అలా చేసినందుకా నేను క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి?`` అని ఆమె స్ప‌ష్టం చేశారు. త‌గు రీతిలో కోర్టు నోటీసుల‌పై స్పందించ‌నున్న‌ట్లు డీఐజీ రూప స్ప‌ష్టం చేశారు. తన నివేదిక తప్పు అనిపిస్తే ఉన్నతస్థాయి విచారణ జరిపించుకోవచ్చని రూప స‌వాల్ విసిరారు. దీనిపై సిద్ధరామయ్య సర్కారు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. అయితే, కమిటీ ఏర్పాటు కాకముందే....రూపను బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు కోర్టు ద్వారా పొందిన ఆదేశాల‌తోనే చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు ప్ర‌త్యేక స‌దుపాయాలైన వ‌స్ర్తాలు - భోజ‌నం - వ‌స‌తి అందిస్తున్న‌ట్లు చెప్తున్న జైళ్ల శాఖ డీజీ వ‌ర్గం ఈ విధంగా వాదించ‌డం ద్వారా రూప‌ను దెబ్బ‌తీయ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

కాగా, చిన్న‌మ్మ పొందుతున్న వ‌స‌తుల‌పై రూప నివేదిక దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తించిన నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు చిన్న‌మ్మ పొందుతున్న సౌక‌ర్యాల‌న్నింటినీ జైలు సిబ్బంది తొల‌గించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత‌కు ఇష్ట‌మైన రంగు అయిన ప‌చ్చ‌రంగు చీర‌ల‌ను ఇటీవ‌లి వ‌ర‌కు శ‌శిక‌ళ ధ‌రిస్తుండ‌గా తాజాగా క‌ల‌క‌లం రేగిన అనంత‌రం వాటిని బ‌య‌ట‌కు విసిరేసిన‌ట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు అంద‌రు ఖైదీల‌వ‌లే తెల్ల‌చీర‌లు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అంద‌రు ఖైదీల వ‌లే చిన్న‌మ్మ‌కు సైతం ఆహార,వ‌స‌తి ఏర్పాట్లు చేసిన‌ట్లు జైలు అధికారులు ఆఫ్ ది రికార్డ్‌గా మీడియాకు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతో స‌క‌ల భోగాల‌కు దూర‌మై చిన్న‌మ్మ ఓ మూల‌న కూర్చొని చిప్ప‌కూడు తింటుంద‌ని అంటున్నారు.