Begin typing your search above and press return to search.

దావోస్ వెళతానన్న సీఎం జగన్ అక్కడ ల్యాండ్ అయ్యారా?

By:  Tupaki Desk   |   21 May 2022 4:30 AM GMT
దావోస్ వెళతానన్న సీఎం జగన్ అక్కడ ల్యాండ్ అయ్యారా?
X
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విపక్ష నేతగా ఉన్న వేళలో.. ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్లిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని అదే పనిగా ఆడిపోసుకోవటం.. విమర్శలు చేయటం తెలిసిందే. తాను ఏదైతే తప్పని చెప్పి వాదించారో జగన్.. ముఖ్యమంత్రి హోదాలో అలాంటి పనే చేయటం ద్వారా.. 'చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు' అన్న మాట అందరి చేత అనిపించుకుంటున్నపరిస్థితి. ఇది సరిపోనట్లుగా.. తాజాగా మరో కొత్త అంశం తెర మీదకు వచ్చి సంచలనంగా మారింది.

దావోస్ వెళతానని చెప్పి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం.. అందరూ అంచనా వేసినట్లుగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ల్యాండ్ కాలేదు. సదరు విమానం.. బ్రిటన్ రాజధాని లండన్ మహానగరంలో ల్యాండ్ కావటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక ప్రకటన అధికారులు చెప్పిన షెడ్యూల్ కు భిన్నంగా సాగటం ఇప్పుడు చర్చగా మారింది.

ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం సీఎం జగన్.. స్విట్జర్లాండ్లోని దావోస్ కు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో ఆయన సతీమణి కూడా ఉంటారన్న వివరాల్ని వెల్లడించలేదు.

తీరా ప్రయాణపు వేళ.. జగన్ తో పాటుఆయన సతీమణి కూడా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దావోస్ లో ల్యాండ్ కావాల్సిన విమానం.. అందుకు భిన్నంగా లండన్ లో ల్యాండ్ కావటం గమనార్హం. లండన్ కు చాలా ముందుగా ఉండే దావోస్ కు వెళ్లని ప్రత్యేక విమానం.. లండన్ లో ఎలా ల్యాండ్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది.

శుక్రవారం ఉదయం 9.40 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి భారతితో కలిసి బయలుదేరిన సీఎం జగన్.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం స్విట్జర్లాండ్ లోని దావోస్ చేసుకుంటారని అధికారిక సమాచారం ఇచచారు. అందుకు భిన్నంగా భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.30గంటల వేళలో లండన్ లో ప్రత్యేక విమానం ల్యాండ్ కావటం గమనార్హం.

ప్రపంచ ఆర్థిక సదస్సులో మన రాష్ట్రం గురించి చెప్పి.. పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ వెళుతున్నట్లుగా పేర్కొనటం తెలిసిందే. అందుకు భిన్నంగా లండన్ కు వెళ్లిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానంలో ఆయనతో పాటు వెళ్లాల్సిన టీం కూడా వెళుతుంటారు. అందుకు భిన్నంగా సీఎం జగన్ దంపతులు ప్రయాణించిన ప్రత్యేక విమానంలో మాత్రం.. వారిద్దరితో పాటు ఏవియేషన్ సలహాదారు భరత్ రెడ్డి మాత్రమే వెళ్లినట్లు చెబుతున్నారు. మరి.. అధికారుల బృందం వేరుగా వెళ్లినట్లుగా తెలుస్తోంది. బారానా కోడికి చారానా మసాలా అంటే ఇదేనేమో?