Begin typing your search above and press return to search.

సామెత చెప్పి అడ్డంగా బుక్ అయ్యాడే

By:  Tupaki Desk   |   21 March 2016 1:26 PM GMT
సామెత చెప్పి అడ్డంగా బుక్ అయ్యాడే
X
రోజులు గతంలో మాదిరి లేవు. చిన్న చిన్న విషయాలే వివాదాలు అయిపోతున్నాయి. రాజకీయ నాయకులు.. సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చేశాయి. మొన్నటికి మొన్న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో భారత్.. పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు ముంబయి నుంచి ప్రత్యేకంగా వచ్చిన బిగ్ బి.. జాతీయ గీతాన్ని పాడాల్సిన సమయం కంటే కొన్ని సెకన్లు అదనంగా పాడారంటూ కోర్టులో కేసు నమోదైన పరిస్థితి. సున్నిత విషయాల్లో ప్రజలు ఎంత అలెర్ట్ గా ఉన్నారో ఇలాంటి విషయాలు చెప్పకనే చెప్పేస్తాయి.

తాజాగా.. ఏపీ అసెంబ్లీలో ఏపీ అధికారపక్షానికి చెందిన నాయకుడు తొందరపడి నోరు జారారు. పాత సామెతను చెప్పే ప్రయత్నంలో.. అడ్డంగా బుక్ అయ్యారు. వెనుకాముందు చూసుకోకుండా మాట్లాడే సమయంలో వాడిన ఒక సామెతను యథాతధంగా వాడేసిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిక్కుల్లో చిక్కుకున్నారు.

విపక్ష ఎమ్మెల్యే రోజా వివాదంపై సభాహక్కుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరుగుతున్న సందర్భంగా నరేంద్ర వివాదాస్పద వ్యాఖ్య ఒకటి చేశారు. విపక్ష ఎమ్మెల్యేలు సభలో దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ.. ఆ విధానాన్ని సామెత రూపంలో చెప్పే ప్రయత్నంలో.. చదువుకున్నోడి కంటే.. అంటూ పాత సామెతను యథాతధంగా చెప్పేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అహంకారపూరిత వ్యాఖ్యల కారణంగా ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని.. ఆర్కే నోటి దురుసుతనంతో ఎమ్మెల్యేలు అనిత.. బొండా ఉమతో పాటు పలువురు బాధితులుగా మారారని చెప్పారు. సభ సాక్షిగా రోజా జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారని.. అలాంటి ఆమెకు ఎలాంటి శిక్షను విధించినా తప్పులేదన్నారు.

నరేంద్ర ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో విపక్షం సభలో లేకపోవటం గమనార్హం. ఎదుటోడి తప్పుల్ని ఎత్తి చూపే వేళ.. విమర్శలు చేసే వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలన్న ప్రాధమిక విషయాన్ని సీనియర్ ఎమ్మెల్యే అయిన నరేంద్ర మర్చిపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అహంకారపూరితంగా విపక్ష నేతలు వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన నరేంద్ర.. తన ప్రసంగంలో అహంకారపూరిత సామెతను ఎందుకు వాడినట్లు..? తాను వాడిన సామెత కారణంగా.. మనోభావాలు దెబ్బ తిన్న వారికి.. నరేంద్ర ఏమని సమాధానం చెబుతారు..?