Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ టీం స్పెష‌ల్ మీటింగ్‌..చెన్నైకి వెంక‌య్య‌!

By:  Tupaki Desk   |   11 Jun 2017 7:20 AM GMT
చిన్న‌మ్మ టీం స్పెష‌ల్ మీటింగ్‌..చెన్నైకి వెంక‌య్య‌!
X
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాలు రస‌కందాయంలో ప‌డిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత అడుగుజాడ‌ల్లో న‌డిచిన అన్నాడీఎంకే నేత‌లు ఇప్పుడు మూడు వ‌ర్గాలుగా చీలిపోయిన సంగ‌తి తెలిసిందే. అమ్మ మ‌ర‌ణం అనంత‌రం మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం సొంత కుంప‌టి పెట్టుకోగా..అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలో చీలిక ఏర్పడి ముఖ్య‌మంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ఒక వర్గం, దినకరన్‌ నేతృత్వంలో మరో వర్గం ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చీలిక రాజకీయాల్లో మ‌రో ప‌రిణామం జ‌రిగింది. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి - చిన్న‌మ్మ శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీటీవీ దినకరన్‌ తన మద్దతుదారులతో అనూహ్యంగా సమావేశమయ్యారు. అదే స‌మ‌యంలో త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను స‌న్నిహితంగా గ‌మ‌నిస్తున్న కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ముఖ్య‌మంత్రి పళ‌నిస్వామితో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.

బెయిల్‌పై విడుద‌ల‌యిన అనంత‌రం శ‌శిక‌ళ‌తో స‌మావేశ‌మైన దిన‌క‌రన్ త‌న సొంత కుంప‌టి రాజ‌కీయాల‌ను వేగవంతం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో దినకరన్‌ కు ఇదివరలో 32 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపగా, శనివారం కొత్తగా మరో ఎమ్మెల్యే సుందరరాజ్‌ మద్దతు ఇచ్చారు. ఆయన ఒట్టపిడారం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రులు సెంథిల్‌ బాలాజీ - పళనియప్పన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ప‌రిణామం ఇటు సీఎం ప‌ళ‌నిస్వామి వ‌ర్గంలో, అటు మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం టీంలో క‌ల‌క‌లానికి దారితీసింది.

ఇదిలాఉండ‌గా.... తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు స‌మావేశం అయ్యారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఏడు రోజుల ప్రదర్శనను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంత‌రం సీఎం ప‌ళినిస్వామి - రాష్ట్ర మంత్రులను కలిశారు. అనంత‌రం వెంక‌య్య‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ త‌మిళ‌నాడు రాష్ట్ర అవసరాలు కనుగొనడానికే తాను చెన్నై వచ్చానని తెలిపారు. ఇందులో రాజ‌కీయం లేద‌ని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు కేంద్ర మంత్రులు - అధికారులు వెళ్లి పరిస్థితులను సమీక్షించటం, ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించటం మోడీ ఆలోచనేనని అన్నారు. టీమ్ ఇండియా అన్నది మోడీ లక్ష్యమని, అన్ని రాష్ట్రాలు, కేంద్రం కలిసి కట్టుగా పని చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వెంక‌య్య నాయుడు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/