Begin typing your search above and press return to search.

ఏపీలో ధ‌ర్నాలు చేయాలంటే అక్క‌డికి వెళ్లాల్సిందే

By:  Tupaki Desk   |   31 Oct 2015 6:16 AM GMT
ఏపీలో ధ‌ర్నాలు చేయాలంటే అక్క‌డికి వెళ్లాల్సిందే
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో రాజ‌ధాని హైద‌రాబాద్‌ లో ఎడాపెడా ధ‌ర్నాలు చేయ‌డంతో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఓ శాశ్వ‌త ప‌రిష్కారం ఆలోచించారు. న‌గ‌ర‌మంతా ధ‌ర్నాలు రాస్తారోకోలు చేప‌ట్ట‌డం వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు...ఇత‌ర‌త్రా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ధ‌ర్నా చౌక్ ఏర్పాటుచేయాల‌ని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నా చౌక్‌ ను ఏర్పాటుచేశారు. ఇపుడు సేమ్ టు సేమ్ పాల‌సీని ఏపీలో అమ‌లుచేసేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశారు.

విజయవాడలోని బందరు రోడ్డులో సబ్‌ కలెక్టరేట్‌ ఎదుట, విక్టోరియా మ్యూజియం ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు ఇంత‌వ‌ర‌కు అనుమతి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు తాత్కాలిక రాజధానిగా విజ‌య‌వాడ‌ను ఎంపిక చేసుకొని న‌గ‌రంలోని జల వనరుల శాఖ ఆవరణలో క్యాంప్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవ‌డంతో ఆ ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్‌ గా ప్రకటించారు. త‌ద్వారా బందరు రోడ్డు ప్రాంతంలో ధర్నాలు - ర్యాలీలు - రాస్తారోకోలను ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ధర్నా చౌక్‌ ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ కసరత్తు చేపట్టింది. హైదరాబాద్‌ ఇందిరా పార్కు తరహాలో ఈ ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

వచ్చే ఏడాది జూన్‌ నాటికి విజయవాడలో సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కొంతమేర సాధారణ పరిపాలన విభాగం (జిఎడి) పని చేస్తోంది. త్వరలోనే మిగిలిన శాఖలు కూడా తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ధర్నా చౌక్‌ ప్రాంతం కోసం పోలీసుశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. క్యాంప్‌ కార్యాలయానికి దూరంగా, ట్రాఫిక్‌ సమస్య తలెత్తని చోట ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. గతంలో స్వరాజ్య మైదానాన్ని ధర్నా చౌక్‌ గా ఏర్పాటు చేయాలకున్నారు. అయితే అది సీఎం క్యాంప్‌ కార్యాలయానికి అతి సమీపంలో ఉండటంతో ఆ ప్రతిపాదనను పోలీసుశాఖ విరమించుకుంది. సీఎం క్యాంప్‌ కార్యాలయం ప్రారంభమైన తర్వాత విజయవాడ కార్పొరేషన్‌ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నాలకు అనుమతించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే సీఎం చంద్రబాబు తాడేపల్లిలోని నివాసం నుంచి అటుగానే క్యాంప్‌ కార్యాలయానికి రావాల్సి ఉంది. దీంతో ఆ ప్రతిపాదననూ పోలీసుశాఖ పక్కన పడేసింది. విజయవాడ సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్‌ కు వెళ్లే రోడ్డుకు, బిఆర్‌ టిఎస్‌ రోడ్డుకు మధ్య ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడ ధర్నా చౌక్‌ ఏర్పాటు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపిన‌ట్లు స‌మాచారం.