Begin typing your search above and press return to search.

వరదలో చిక్కుకున్న డిప్యూటీ సీఎం ఇల్లు

By:  Tupaki Desk   |   1 Oct 2019 6:25 AM GMT
వరదలో చిక్కుకున్న డిప్యూటీ సీఎం ఇల్లు
X
గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో దంచి కొట్టే వర్షాలు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. గతంలో ఈ తరహా వర్షాలు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చోటు చేసుకునేవి. కానీ.. మారిన వాతావరణ పరిస్థితులతోనో.. క్యుమిలో నింబస్ కారణంగా గంటల వ్యవధిలో సెంటీమీటర్ల వర్షం డబుల్ డిజిట్లలో కురుస్తోంది. ఈ కారణంగా ఊహించలేని నష్టం చోటు చేసుకోవటమే కాదు.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు.

ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లు పడుతున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం కావటమే కాదు.. లోతట్టు ప్రాంతాలు భారీగా ప్రభావితమవుతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే బిహార్.. ఉత్తరప్రదేశ్ లోనిచాలా ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో దేశంలో మరెక్కడా చోటు చేసుకోని రీతిలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున మరణాలు ఈ రాష్ట్రాల్లో కురిసిన వానలతో చోటు చేసుకుంది.

నాన్ స్టాప్ గా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్ లో 111 మంది మరణిస్తే.. బిహార్ లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్.. జార్ఖండ్.. ఉత్తరాఖండ్.. మధ్యప్రదేశ్.. రాజస్తాన్ లలో 19 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా 157 మంది ప్రాణాలు పోయాయి. ఇదిలా ఉంటే.. బిహార్ రాజధాని పాట్నాలో వర్షం తీవ్రత ఎంతలా ఉందంటే.. ఏకంగా డిప్యూటీ సీఎం అధికారిక నివాసం సైతం వర్షపునీటిలో చిక్కుకుపోయింది. భారీగా కురుస్తున్న వర్షం కారణంగా జల దిగ్భంధంలో డిప్యూటీ సీఎం నివాసం చిక్కుకుపోవటంతో.. అధికారులు రంగంలోకి దిగారు.

డిప్యూటీ సీఎం సుశీల్ మోడీతో పాటు.. ఆయన కుటుంబ సభ్యుల్ని పోలీసులు రక్షించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకోసం రబ్బరు బోటును వినియోగించారు. గడిచిన మూడు రోజులుగా బిహార్ లోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. బలియా జిల్లా జైలులోకి వర్షపు నీరు భారీగా ప్రవేశించటంతో జైల్లోని 900 మంది ఖైదీల్ని వేరే జైళ్లకు తరలించారు. వర్షాలు ఆయా రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పక తప్పదు.