Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: ఆఫీస్ స్పేస్ కు నో గిరాకీ!

By:  Tupaki Desk   |   9 July 2020 5:00 AM GMT
కరోనా ఎఫెక్ట్:  ఆఫీస్ స్పేస్ కు నో గిరాకీ!
X
కార్పొరేట్లు వైదొలుగుతున్నారు.. కంపెనీలను ఎత్తేస్తున్నారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో కరోనా ఎఫెక్ట్ బాగానే పడింది. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలన్నీ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి లీజుకు తీసుకున్న ‘ఆఫీస్ స్పేస్’ను భారీగా వదులుకుంటున్నాయి. తద్వారా పెద్ద ఎత్తున యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.

గత ఏడాది జూన్ తో ముగిసిన త్రైమాసికం మూడునెలల్లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఏకంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ రెట్టింపు అయ్యింది. 1.87 కోట్ల చదరపు అడుగులుగా నమోదైంది. కార్పొరేట్ కంపెనీలు, కోవర్కింగ్ స్పేస్ కంపెనీల నుంచి ఈ కార్యాలయాల స్థలాలకు డిమాండ్ పెరిగిపోయిందని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ (సీఅండ్ డబ్ల్యూ) సంస్థ నివేదికలో వెల్లడించింది. వీటివల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపింది.

సీఅండ్ డబ్ల్యూ సంస్థ నివేదిక ప్రకారం.. ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఒప్పందాలు అత్యధికంగా జరిగిన నగరంగా బెంగళూరు నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లోనూ భారీగానే ఒప్పందాలు జరిగాయని తెలిపింది. గత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఈ ఎనిమిది నగరాల్లో 3.2 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని తెలిపింది. 2018 సంవత్సరంతో పోలిస్తే 2019లో ఇది 66శాతం పెరగడం విశేషం.

అయితే 2020 సంవత్సరాన్ని కరోనా కబళిస్తోంది. ఈ సంవత్సరం కరోనా ప్రభావంతో దేశంలో ఆఫీస్ స్పేస్ లకు గిరాకీ తగ్గిపోయింది. ప్రధాన నగరాల్లో లీజుకు ఆఫీస్ స్థలాలు తీసుకునే విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఇది 73శాతం పడిపోయినట్టు రియల్ ఎస్టేట్ సంస్థ కుష్ మాన్ అండ్ వేక్ ఫీల్డ్ తాజా నివేదికలో పేర్కొంది. హైదరాబాద్ ,ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, ఫూనే, అహ్మాదాబాద్, కోల్ కతా నగరాల్లో ఇదే పరిస్థితి ఉందని ఈ సంస్థ తెలిపింది. దీంతో కరోనా కాటుతో ఉద్యోగాలు పెద్ద ఎత్తున పోయాయని... రియల్ భూమ్ డిమాండ్ కూడా పడిపోయిందని స్పష్టం చేసింది.