Begin typing your search above and press return to search.

111 దేశాల్లో డెల్టా దెబ్బ‌.. భార‌త్‌కు కూడా ముప్పు!!

By:  Tupaki Desk   |   15 July 2021 4:30 PM GMT
111 దేశాల్లో డెల్టా దెబ్బ‌.. భార‌త్‌కు కూడా ముప్పు!!
X
ప్ర‌పంచంలోని 111 దేశాలు గ‌డ‌గ‌డ‌లాడుతున్నాయా? క‌రోనా మ‌హ‌మ్మారి త‌న విశ్వ‌రూపాన్ని మ‌రింత పెంచిందా? డెల్టా వేరియంట్ ఇప్ప‌టికే ఆయా దేశాల్లో విస్త‌రించిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ‌నోమ్‌. కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతుండటంపై అధనోమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నామంటూ ఆయ‌న తీవ్ర‌స్తాయిలో హెచ్చరించారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు సామాజిక కార్యకలాపాలు పెరగడం, ప్రజారోగ్య చర్యల్ని సరిగా పాటించకపోవడం, ప్రభుత్వాలు ఆంక్షలను సడలించడం వల్ల కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు వ్యాఖ్యానించించారు.

ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్‌ రేటు పెరగడం వల్ల కొన్ని నెలలుగా కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా టెడ్రోస్‌ గుర్తుచేశారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో తాజా తిరోగమన పరిస్థితులపై టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తంచేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైరస్‌ నిరంతరం రూపాంతరం చెందుతుండటంతో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్‌ 111 దేశాలకు పైగా వ్యాపించిందని తెలిపారు.

ప్రపంచంలో అనేక దేశాలకు ఇప్పటివరకు ఏ వ్యాక్సినూ అందలేదని, ఇంకా చాలా దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు రాలేదన్నారు. అన్ని దేశాల్లోనూ సెప్టెంబర్‌ నాటికి కనీసం 10శాతం మంది జనాభాకు వ్యాక్సిన్‌ వేయించేలా చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాలో 40శాతం మందికి, 2022 మధ్యకాలం నాటికి 70శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కోరారు. వ్యాక్సిన్‌ ఒక్కటే ఈ మహమ్మారిని కట్టడి చేయలేదని, స్థిరమైన, సానుకూల విధానాలతో ముందుకు సాగాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.

పూర్తి స్థాయిలో ప్రజారోగ్య వ్యవస్థను అందుబాటులో ఉంచడంతో పాటు సామూహిక సమావేశాలపై కట్టడిపై సమగ్ర విధానాన్ని అమలుచేయాల్సిన అవసరంఉందన్నారు. కఠిన నిబంధనలు అమలుచేయడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయొచ్చని అనేక దేశాలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక‌, భార‌త్ విష‌యానికి వ‌స్తే.. దేశంలోనూ కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌లు పెరుగుతున్నాయి. దీనిపై ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించింది. ఏపీలోనూ మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ధ‌ర్డ్ వేవ్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.