Begin typing your search above and press return to search.

ఒక టిక్కెట్.. రెండు ఖర్చీఫ్ లు..

By:  Tupaki Desk   |   27 Aug 2018 7:00 AM IST
ఒక టిక్కెట్.. రెండు ఖర్చీఫ్ లు..
X
ఎన్నికల సీజన్ వచ్చేసింది. అంతర్గతంగా టికెట్ల కోసం రాజకీయాలు మొదలయ్యాయి. ఖమ్మం ఖిల్లాలో ఇద్దరు గులాబీ నేతలు టిక్కెట్ కోసం కత్తులు దూసుకుంటున్నాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం ఎంతో మంది బలమైన నేతలను అందించింది. ఇప్పుడా నియోజకవర్గంలో గులాబీ పార్టీ టిక్కెట్ కోసం అంతర్గత యుద్ధం నడుస్తోంది.

సత్తుపల్లి ఎమ్మెల్యేగా 2014లో సండ్ర వెంకటవీరయ్య టీడీపీ నుంచి గెలుపొందారు. ఆయన కేవలం రెండు వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి దయానంద్ పై బోటాబోటీ మెజార్టీతో గెలిచారు. మూడో స్థానంలో టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన పిడమర్తి రవి కేవలం 6వేల ఓట్లు మాత్రమే సాధించి బొక్కబోర్లాపడ్డారు.

ఆ తర్వాత పరిణామాల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన శ్రీనివాసరెడ్డితో కలిసి దయానంద్ టీఆర్ ఎస్ లో చేరారు. ఇప్పుడు దయానంద్ చేరికతో సత్తుపల్లి టిక్కెట్ వచ్చేసారి ఎవరికీ ఇస్తారనే వార్ ఇప్పటినుంచే మొదలైందట.. ఎంపీ శ్రీనివాసరెడ్డి వర్గంలో దయానంద్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం లో పిడమర్తి రవి ఉంటూ ఎవరి కార్యక్రమాల్లో వారు ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి టిక్కెట్ కోసం పోరు తీవ్రమైంది. నియోజకవర్గంలో అధికశాతం ఉన్న మాదిక సామాజికవర్గం ను క్యాష్ చేసుకోవాలని రవి - దయానంద్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తుమ్మల మాట విని పిడమర్తికి చాన్స్ ఇస్తాడా.? లేక బలమైన దయానంద్ కు సీటు ఖరారు చేస్తాడా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.