Begin typing your search above and press return to search.

మహారాష్ట్రపై కొవిడ్ పంజా.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   6 April 2021 3:25 AM GMT
మహారాష్ట్రపై కొవిడ్ పంజా.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
X
మహారాష్ట్రలో కొవిడ్ తన విశ్వరూపం చూపిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనే మహారాష్ట్రలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో గరిష్ఠ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అనగా 24 గంటల్లో 47,288 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా మరో 155 మంది మృత్యువాత పడినట్లు నివేదికలో వెల్లడించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 4,51,375 క్రియాశీల కేసులున్నట్లు ఈ మేరకు మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ను సోమవారం రాత్రి విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో మరో 26,252 మంది వైరస్ నుంచి విముక్తి పొందినట్లు తెలిపింది. మొత్తం 25,49,075 మంది వైరస్ నుంచి కోలుకున్నారని నివేదికలో పొందుపర్చారు. ఆ రాష్ట్రంలో మొత్తం 30,57,885 కరోనా కేసులు నమోదుకాగా.. 56,033మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడయ్యాయి. ఎక్కువగా ముంబై నగరంలో కొవిడ్ వ్యాపిస్తోంది.

కరోనా కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. ముందు నుంచి ఎన్ని పటిష్ఠ చర్యలు తీసుకున్నా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటివి అమలు చేస్తున్నారు. అయినా మహరాష్ట్రపై కొవిడ్ పంజా విసురుతూనే ఉంది. కేంద్రం కూడా ఆ రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి తగ్గించడానికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.