Begin typing your search above and press return to search.

ముంబైలో శాంతించిన మహమ్మారి: అతితక్కువగా కేసులు

By:  Tupaki Desk   |   29 July 2020 6:50 AM GMT
ముంబైలో శాంతించిన మహమ్మారి: అతితక్కువగా కేసులు
X
మహమ్మారి శాంతించింది.. తీవ్రరూపంలో విజృంభించిన ఆ వైరస్ మహారాష్ట్ర రాజధాని.. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో తగ్గుముఖం పట్టింది. అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దేశంలో మొద‌టి నుంచి అత్య‌ధిక కేసులతో టాప్ స్థాయిలో మహారాష్ట్ర నిలుస్తూ ఉంది. ఏప్రిల్ నుంచి మ‌హారాష్ట్ర‌లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల‌ను దాటిపోయింది. మొత్తం మూడు ల‌క్ష‌ల ఎన‌భై వేల వ‌ర‌కూ కేసులు న‌మోద‌య్యాయి. వాటిల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,47,896. ఆ రాష్ట్రంలో ఒక్క ముంబైలోనే లక్షల సంఖ్యలో కేసులు వచ్చాయి. మూడు నెల‌లుగా ఏ రోజుకారోజు కేసుల సంఖ్య‌లో కొత్త నంబ‌ర్ నమోద‌వుతూ వ‌చ్చింది.

ఇలా అత్య‌ధిక కేసులు నమోదవుతున్న మ‌హారాష్ట్రలో పరిస్థితి ఊరట కల్పించేలా పరిణామం జరిగింది. 24 గంట‌ల్లో ముంబై న‌గ‌రంలో న‌మోదైన కేసుల సంఖ్య 700. మూడు నెల‌ల్లో ఏ రోజూ కూడా ఇంత త‌క్కువ స్థాయిలో కేసులు న‌మోదు కాలేదు. తొలిసారి తక్కువ సంఖ్యలో కేసులు రావ‌డంతో కొంత ఊర‌ట పొందుతోంది. మ‌హారాష్ట్ర మొత్తంగా కూడా ఇర‌వై నాలుగు గంట‌ల్లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009 వ‌ర‌కు త‌గ్గింది. ఇంకా దేశంలో అత్య‌ధిక కేసులు న‌మోదైన రాష్ట్రంగా మహారాష్ట్రనే నిలుస్తోంది. అయితే దీంతో సంబరపడవద్దని రోజువారీగా కొత్తగా న‌మోద‌య్యే కేసుల సంఖ్య త‌గ్గి, డిశ్చార్జిల సంఖ్య పెరిగితే.. ప‌రిస్థితి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.