Begin typing your search above and press return to search.

ప్రపంచం పై పంజా విసురుతున్న వైరస్ ... @ 50 లక్షలు!

By:  Tupaki Desk   |   21 May 2020 8:50 AM GMT
ప్రపంచం పై పంజా విసురుతున్న వైరస్ ... @ 50 లక్షలు!
X
ఈ మహమ్మరి చైనాలో వెలుగులోకి వచ్చి అప్పుడే ఆరు నెలలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి కేసులు 50 లక్షలు దాటేశాయి. 3 లక్షల 25వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 213 దేశాలకు వైరస్‌ విస్తరించింది. ఇప్పటివరకు ఏ వ్యాధి కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలను భయపెట్టలేదు. వ్యాక్సిన్‌ ఇప్పుడప్పుడే వస్తుందన్న ఆశ లేకపోవడంతో వైరస్ తో కలిసి బతుకు బండిని సాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆర్థికం, ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించడం కోసమే దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి.

మొదట్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేసింది. ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకి అమెరికా ఇంకా వణుకుతూనే ఉంది. 15 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 93 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 రాష్ట్రాల్లోనూ లాక్‌ డౌన్ ‌ను ఎత్తేశారు. అయితే తాము అత్యధికంగా చేస్తున్న కోవిడ్‌ పరీక్షల కారణంగానే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకుంటున్నారు.

ఇక ప్రపంచ దేశాల్లో మహమ్మారి కేసుల్లో రష్యా రెండో స్థానానికి చేరుకుంది. కేసులు 3 లక్షలు దాటేశాయి. 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు, మూడు వారాలుగా ప్రతిరోజూ దాదాపుగా 10 వేల కేసులు నమోదవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మాత్రం తక్కువగా ఉండడం ఊరటనిస్తోంది. వైరస్‌ సోకిన వారిలో ఒక్కశాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారు. అలాగే గత రెండు వారాలుగా చైనా లోని వూహాన్‌ వెలుపల వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన పెంచుతోంది. చైనా ఉత్తర ప్రావిన్స్‌లలో 46 కేసుల వరకు నమోదయ్యాయి. అయితే వూహాన్‌లో వైరస్‌కి, ఇక్కడ వైరస్‌కి మధ్య తేడాలు చాలా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

యూరప్‌ లో మహమ్మారి వణికిస్తున్న దేశాల్లో యూకే ప్రధానమైనది. బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ కరోనాపై పోరాటం చేసి కోలుకున్నప్పటికీ ఆ దేశంలో కేసుల్ని అరికట్టడంలో విఫలమవుతున్నారు. 2 లక్షల 50 వేలకు పైగా కేసులు నమోదైతే, 35 వేల మంది కంటే ఎక్కువే మృతి చెందారు. బ్రిటన్‌ లో లాక్ ‌డౌన్‌ ఇంకా కొనసాగుతున్నా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. మొదట్లో ఎస్‌ టైప్‌ వైరస్‌ స్ట్రెయిన్స్‌ వస్తే, ఇప్పుడు ఎల్‌ టైప్‌ స్ట్రెయిన్స్‌ కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది.

లాటిన్‌ అమెరికా దేశాల్లోని బ్రెజిల్‌లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటలీ, యూకేని దాటేసి నాలుగో స్థానంలోకి చేరుకుంది. కేసులు 2 లక్షల 70 వేలు దాటితే, 18 వేల మంది వరకు మరణించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరా ఈ మహమ్మారిని అసలు పట్టించుకోలేదు. వైరస్‌ వస్తే ఏమవుతుంది ? అంటూ వ్యాఖ్యలు చేసి ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆంక్షలు కూడా విధించకపోవడంతో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.