Begin typing your search above and press return to search.

లోకేశ్ కు చిన్నమ్మ సపోర్టు? టీడీపీలో కొత్త సమీకరణలు!

By:  Tupaki Desk   |   22 April 2022 9:35 AM GMT
లోకేశ్ కు చిన్నమ్మ సపోర్టు? టీడీపీలో కొత్త సమీకరణలు!
X
ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామానికి తెర లేవనుందా? ఇంతకాలం ఉప్పు నిప్పులా ఉన్న రెండు కుటుంబాలు ఏకం కానున్నాయి? ఒకే వేదిక మీదకు రాబోతున్నారా? రాజకీయ విభేదాల్ని పక్కన పెట్టేసి.. భుజం భుజం కలపటం ద్వారా కొత్త సమీకరణాలకు తెర తీస్తున్నారా? అంటే అవుననే చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరేలా బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి మాటలు ఉన్నాయి.

నారా చంద్రబాబు నాయుడు.. దగ్గుబాటి వెంకటేశ్వర్వరావు మధ్య నున్న పంచాయితీ ఓపెన్ సీక్రెట్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన నాటి నుంచి డాక్టర్ గారు (దగ్గుబాటి వెంకటేశ్వరరావు) ఉంటే.. తర్వాతి కాలంలో పార్టీలోకి వచ్చి చేరారు చంద్రబాబు. అప్పట్లో చంద్రబాబు.. డాక్టర్ గారి గ్రూపులు తెలుగుదేశంలో ఉండేవి. దీంతో.. నేతలు చాలానే ఇబ్బంది పడేవారు. పెద్దల్లుడితో ఉండాలా? చిన్నల్లుడితో ఉండాలో తేల్చుకోలేని పరిస్థితి. ఎప్పుడైతే పార్టీ మొత్తం చంద్రబాబు చేతికి రావటంతో అలాంటివన్నీ పార్టీలో కనిపించకుండా పోయాయి.

అయితే.. ఎన్టీఆర్ నుంచి పార్టీని తమ చేతుల్లోకి తీసుకునే వేళ.. ఇద్దరు అల్లుళ్లు.. నందమూరి కుటుంబం మొత్తం ఒకే తాటి మీద ఉండటం తెలిసిందే. తర్వాతి రోజల్లో చంద్రబాబు తీరు నచ్చక దగ్గుబాటి పార్టీ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ లో చేరారు. కట్ చేస్తే.. 2004లో పురంధేశ్వరి ఎంపీగా గెలవటం.. ఆ వెంటనే కేంద్రమంత్రి కావటం.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్ ప్రభుత్వంలో మర్యాదను పొందారు. దాదాపు పదేళ్లు చంద్రబాబు విపక్షంలో ఉంటే.. అదే సమయంలో డాక్టర్ గారి కుటుంబం అధికారంలో ఉంది. అలా.. సుదీర్ఘకాలం ఇరుకుటుంబాల మధ్య మాటలు ఉండేవి కావు.

ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగే మాత్రమే వెళ్లేవారు కానీ.. చంద్రబాబు వంక చూడను కూడా చూసేవారు కాదు. ఇలా తెలుగు రాజకీయాల్లో ఉప్పునిప్పుగా ఉండే కుటుంబాల్లో చంద్రబాబు.. వెంకటేశ్వరరావు ఫ్యామిలీలు ఉండేవి. ఇప్పుడు చంద్రబాబు వయసు మీద పడటం.. టీడీపీ నారా లోకేశ్ చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఉండటం తెలిసిందే. ఇలాంటి వేళ లోకేశ్ కు దన్నుగా ఉండేందుకు పురంధేశ్వరి కుటుంబం ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. దగ్గుబాటి రాజకీయ వారసుడైన హితేస్ ను టీడీపీలో చేర్చే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

రానున్న రోజుల్లో లోకేశ్ కు గట్టి మద్దతు అవసరమైనప్పుడు నందమూరి కుటుంబ అండతో పాటు.. దగ్గుబాటి కుటుంబ ఆశీస్సులు కూడా కలిస్తే మరింత బలోపేతం అవుతాయి. అదే సమయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా కుటుంబంతో కలవటం అవసరం. ఇలా పరస్పర అవసరాలు రెండు కుటుంబాల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గర చేస్తున్నాయని చెప్పొచ్చు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ఒక మీడియా చానల్ లో మాట్లాడిన సందర్భంలో దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఇంతకాలం రాజకీయంగా వేర్వేరుగా ఉన్న రెండు బలమైన కుటుంబాలు ఇప్పుడు ఒక వేదిక మీదకు వస్తే టీడీపీకి మరింత బలం పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ మార్పు వాస్తవరూపంలోకి రానుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.