Begin typing your search above and press return to search.

టెక్‌ మహింద్రా.. ఇన్ఫోసిస్‌ లో ఉద్యోగాల పేరుతో సైబర్ మోసం !

By:  Tupaki Desk   |   24 March 2021 11:30 PM GMT
టెక్‌ మహింద్రా.. ఇన్ఫోసిస్‌ లో ఉద్యోగాల పేరుతో సైబర్ మోసం !
X
దేశవ్యాప్తంగా సైబర్‌ మోసగాళ్లు పెరిగిపోయారు. అందినకాడికి అడ్డంగా దోచేస్తున్నారు. క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డు లింకులు వంటి పేర్లతో ఇప్పటి వరకు మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు.. కొత్త తరహా దోపిడీలకు తెరతీస్తున్నారు. నిరుద్యోగులని టార్గెట్ చేసుకొని ఈజీగా మోసం చేస్తున్నారు. దిల్లీ, నోయిడాలలో ఉంటున్న నిందితులు ఉద్యోగాలిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతోమంది బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగాలు చేస్తున్న వారు మోసపోతున్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుం పేరుతో రూ.10వేల నుంచి రూ.50వేలు వసూలు చేస్తున్నారు. అనంతరం నియామక పత్రాలు ఇస్తామంటూ రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

టాటా మోటార్స్‌లో ఉద్యోగం పేరుతో సైబర్‌ నేరస్థులు శ్రీనగర్‌ కాలనీలో ఉంటున్న యువతి భార్గవిని మోసం చేశారు. క్వికర్‌ జాబ్‌ పోర్టల్‌ లో ఆమె వివరాలను చూసిన సైబర్‌ నేరస్థుడు అమిత్‌ కొద్దిరోజుల క్రితం ఆమెకు ఫోన్‌ చేశాడు. మహారాష్ట్రలోని టెక్‌ మహీంద్ర శాఖల్లో ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు. ముందుగా రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నాడు. అనంతరం ధరావతు సొమ్ము పేరుతో రూ.25వేలు నగదు బదిలీ చేయాలని అభ్యర్థించాడు. రెండు రోజుల తర్వాత అమిత్‌ ఫోన్‌ చేసి ఉద్యోగానికి ముందు రెండు వారాల పాటు ఆన్ ‌లైన్‌ శిక్షణ ఉంటుందని ఇందుకోసం రూ.15వేలు చెల్లించాలని, అనంతరం రెండురోజుల్లోనే ముంబయి నుంచి మెయిల్‌ వస్తుందని చెప్పాడు. మెయిల్‌ రాకపోవడంతో బాధితురాలు ఫోన్‌ చేయగా.. మరో రూ.65వేలు పంపితే నియామక పత్రం వస్తుందని చెప్పాడు. ఆమేరకు చెల్లించింది. అనంతరం బాధితురాలు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ ఉంది. దీంతో ఆమె సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విధ జాబ్‌పోర్టళ్లలో ఉద్యోగార్థులు నమోదు చేసుకున్న వివరాలను సైబర్‌ నేరస్థులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు నేరస్థులు దిల్లీలో ఒక ఫ్లాట్‌ ను అద్దెకు తీసుకుని వైబ్ ‌సైట్ల నుంచి నిరుద్యోగుల వివరాలను కొనుగోలు చేసి ఫోన్లు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామంటూ చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారికి ముంబయి, చెన్నై, నోయిడా, పుణెలో ఉన్న టెక్‌ మహింద్రా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలతో తమకు ఒప్పందాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తూ మోసాలకు పాల్పడుతున్నారు.