Begin typing your search above and press return to search.

డేరాబాబా భూములు..కేసీఆర్‌ కు చిక్కులు

By:  Tupaki Desk   |   31 Aug 2017 10:36 AM IST
డేరాబాబా భూములు..కేసీఆర్‌ కు చిక్కులు
X
వివాదాస్ప‌ద డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ భూముల వ్య‌వహారం తెలంగాణ ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకుంటోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో డేరా స్వచ్ఛసౌదా ఆశ్రమం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆశ్ర‌మ‌ భూముల్లో కొనుగోలు చేసిన వాటితో పాటుగా అసైన్డ్ భూములు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఈ ఆశ్ర‌మం విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డంతో విప‌క్షాలు రంగంలోకి దిగింది. భూముల వివాదం అంటే ఎంట్రీ ఇచ్చే ఎర్ర‌జెండాల పార్టీ నాయ‌కులు ఈ భూముల కేంద్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేశారు.

డేరా బాబా విస్త‌రించిన హ‌ర్యానా - పంజాబ్‌ ల‌లో భ‌క్తుల ఆధారంగా క‌ల‌క‌లం రేగి రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం ఇర‌కాటంలో ప‌డిపోతున్న క్ర‌మంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం మ‌రో త‌ర‌హా క‌ల‌క‌లం ప్రారంభ‌మ‌యింది అంటున్నారు. భూములను గాడిలో పెట్టేందుకు నిజాం స‌ర్కారు త‌ర్వాత రికార్డు స్థాయిలో నివేదిక‌లు స‌రిదిద్దేందుకు సిద్ధ‌మ‌యిన కేసీఆర్‌ కు ఈ బాబా భూముల కార‌ణంగా చిక్కులు మొద‌ల‌యిన‌ట్ల‌ని అంటున్నారు. డేరా బాబా భూములు పేద‌ల‌కు అప్ప‌గించాల‌ని, అసైన్డ్ భూముల‌ను సొంతం చేసుకోవాల‌ని ఎర్ర‌న్న‌లు గ‌ళం విప్పారు. తోడుగా రైతు సంఘం నేత‌ల‌ను సైతం వెంట‌బెట్టుకువెళ్లారు.

నల్లగొండ జిల్లాలో డేరా బాబా ఆధీనంలోని భూముల్ని స్వాధీనం చేసుకోవాలని సీపీఎం - వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు - రైతు సంఘం నాయ‌కులు ఆందోళ‌న మొద‌లుపెట్టారు. వెలిమినేడులోని డేరా స్వచ్ఛసౌదా ఆశ్రమం ఆక్రమించుకున్న 12 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమిలో ఎర్రజెండాలు పాతారు. ఈ సందర్భంగా విప‌క్షాల నేత‌లు మాట్లాడుతూ టీఆర్‌ ఎస్‌ పాలనలో అసైన్డ్‌ భూములకు - పేదల భూములకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ - సీలింగ్‌ భూములు కబ్జాకు గురైనప్పటికీ వాటిని వెలికితీయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కబ్జాకు గురైన అసైన్డ్‌ - సీలింగ్‌ భూముల గుర్తింపు కోసం సెప్టెంబర్‌ 19న సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి డేరా స్వచ్ఛసౌదా ఆశ్రమంలోని నిర్మాణాలను తొలగించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. డేరాబాబాపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న భూసమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించి కబ్జాలోనున్న వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాబాలు - స్వాములను పెంచి పోషిస్తూ తమ రాజకీయ స్వార్థానికి కొన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయన్నారు. రేపటిలోగా 12 ఎకరాల అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకోకపోతే వ్యకాస ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.