Begin typing your search above and press return to search.

కరోనా: భయపెడుతున్న ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ

By:  Tupaki Desk   |   18 April 2020 3:40 AM GMT
కరోనా: భయపెడుతున్న ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ
X
భారతదేశంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నగరంగా దేశ వాణిజ్య రాజధాని ముంబై నిలిచింది. ఇక్కడ దేశంలోనే అన్ని నగరాలతో పోల్చితే అత్యధికంగా 2073 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనూ దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ‘ధారవి’లో 100+కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని బాంబు పేల్చింది. శుక్రవారం 15 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

మతుంగా కార్మిక క్యాంపులో మూడు కొత్త కేసులు , ముస్లిం నాగరాండ్, ఇందిరానగర్, సోషల్ నగర్ , బలిజనగర్, లక్ష్మీచాల్, జనతా సొసైటీ, సర్వోడే సొసైటీ వంటి కార్మిక వాడల్లో కూడా కరోనా వైరస్ ప్రబలుతోంది. 8 లక్షలకు పైగా ప్రజలు ఇక్కడ ఉన్నారు. పూట గడవడమే ధ్యేయంగా ఉండే కార్మికులు, పేదలు పనులు చేయకుండా ఉండలేరు. అటువంటి వారు కరోనా కోసం భయపడి ఇంట్లో ఉండే రకం కాదు.. దీంతో వీరికి, వీరి ద్వారా చాలా మందికి కరోనా సోకే ప్రమాదం వాటిల్లుతోంది. సామాజిక దూరం ‘ధారవి’ మురికివాడలో అసలే పాటించడం లేదని తెలుస్తోంది. దీంతోపాటు ఇక్కడి ఇళ్లు ఇరుకుగా, కుటుంబమంతా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటారు. పక్కింటితోనూ దగ్గరి సంబంధాలుంటాయి. చాలా దగ్గరగా ఇళ్లు ఉండే ఈ మురికివాడల్లో కరోనా వేగంగా వ్యాపించడం ఖాయమన్న భయం ఆరోగ్యశాఖను వెంటాడుతోంది.

ముంబైలోని ఈ ధారవి, మురికివాడలను హాట్ స్పాట్ గా ప్రకటించారు. భారీ జనాభా కారణంగా వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతోంది. ధారవిలో మొత్తం 9 కంటైనర్ జోన్లను గుర్తించారు. పోలీసులు భారీగా బారికేడ్లను పెట్టి జనాలను బయటకు రాకుండా నిర్బంధించారు.

ఇక ధారావి మురికివాడ ప్రజలకు ముంబై కార్పొరేషన్ ఇంటివద్దకే నిత్యావసర సరుకులు, కిరాణా సామాగ్రిని అందజేస్తోంది. అత్యధిక జనాభా గల ముంబైలో కరోనాను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాక పోవడంతో ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్ ను పొడిగించారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే. ప్రస్తుతం కరోనా కేసులతో మురికివాడల్లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.