Begin typing your search above and press return to search.

చైనాలో కరోనా మృత్యుఘోష ..ఒక్క రోజే 242 మంది

By:  Tupaki Desk   |   13 Feb 2020 6:45 AM GMT
చైనాలో కరోనా మృత్యుఘోష ..ఒక్క రోజే 242 మంది
X
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ ...తన పంజా పవర్ ఏంటో చూపిస్తోంది. తాజాగా చైనాలో ఈ కరోనా మృత్యుకేళి తీవ్రస్థాయికి చేరి భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ పై తీసుకున్న చర్యలన్నీ కూడా వృధానే అని దీనితో స్పష్టమైంది. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి వైద్య పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మృతుల సంఖ్యకు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.

బుధవారం ఒక్కరోజే ఈ వైరస్‌ జన్మించిన హ్యుబే ప్రావిన్స్‌ లో 242 మంది మరణించారంటే ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం ఊహించుకోవచ్చు. కొత్తగా మరో 14,840 మంది వైరస్‌ సోకడం గమనార్హం. దీంతో కరోనా ( కొవిడ్-19 ) కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,355కు చేరింది. ఇక వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 60 వేలు దాటింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న వారిని వేర్వేరు ఆసుప్రతుల్లో ఉంచి, అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. మరి కొందరిని ప్రత్యేక శిబిరాల్లో డాక్టర్ల పర్యవేక్షణ లో ఉంచినట్లు తెలియజేసింది. కాగా.. హుబేయ్ కేంద్రంగా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌ కు .. డ‌బ్ల్యూహెచ్‌వో తాజాగా కోవిద్‌-19 అని పేరు పెట్టిన విష‌యం తెలిసిందే.

కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచీ చైనాలోని అనేక పట్టణాలు, నగరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోజువారీ అవసరాల కోసం కూడా ప్రజలు రోడ్ల మీదికి రావడానికి వణికిపోతున్నారు. వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాలోని పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వ్యక్తిగత కార్లను కూడా వినియోగించట్లేదు. అన్ని రకాల రవాణా సాధనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను సాగించడం వల్ల కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశం తో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే బుధవారం ఒక్కసారిగా మృతుల సంఖ్య పెరగడానికి కారణం ..కొవిడ్‌-19 సోకిన వారిని గుర్తించడానికి అవలంబిస్తున్న పద్దతే అని హ్యుబే ప్రావిన్స్‌ అధికారులు తెలిపారు.