Begin typing your search above and press return to search.

అలర్ట్ : గాలిలో కరోనా వైరస్.. వెల్లడించిన సీసీఎంబీ

By:  Tupaki Desk   |   5 Jan 2021 8:09 PM IST
అలర్ట్ : గాలిలో కరోనా వైరస్.. వెల్లడించిన సీసీఎంబీ
X
ఇప్పటి వరకూ కరోనా వైరస్ ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది అనే విషయంపై దాదాపు అందరికీ ఒక విధమైన అవగాహన ఉంది. అప్పటికే వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపరలను ఎవరైతే పీలుస్తారో వారికి వైరస్ వ్యాపిస్తుంది. ఇంకా.. చేతి స్పర్శ ద్వారా కూడా వస్తుంది. అంటే.. బాధితుడితో షేక్ హ్యాండ్ ఇవ్వడం.. అతను టచ్ చేసిన వస్తువులను తాకడం ద్వారా వైరస్ ప్రబలుతుందని తెలుసు. కానీ.. ఇప్పుడు గాలితోనూ వైరస్ వ్యాపిస్తోందని సీసీఎంబీ ప్రకటించింది.

ప్రధానంగా ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్ ఉంటోందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) వెల్లడించింది. కరోనా బాధితులు ఉన్న ఐసీయూ గదుల్లో వారి శ్వాస ద్వారా వెలువడిన వైరస్ ఆ గదుల్లోనే ఉంటోందని నిపుణులు తెలిపారు. ఐసీయూ గదుల్లో ఎయిర్ కండిషన్ ఉంటుంది. ఆ ఏసీ బయటకు వెళ్లకుండా గదిని అద్దాలు(గ్లాసెస్)తో పూర్తిగా కవర్ చేస్తారు. దీంతో.. లోపలి గాలి బయటకు వెళ్లక.. బయటి గాలి లోపలికి వచ్చే అవకాశం ఉండదు. అలా గదిలో ఉన్న గాలిలో వైరస్ కలిసి ఉంటోందని వెల్లడించారు.

అయితే.. గాలిలో వైరస్ ఉంటుందంటే ఐసీయూ వరకే పరిమితం అని చెప్పలేం. బయట కూడా ఉండే అవకాశం ఉంది. గతంలోనే పలువురు శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తంచేస్తూ డబ్ల్యూహెచ్ వోకు లేఖ కూడా రాశారు. గాలిలో కరోనా వైరస్ ఉంటుందని ప్రకటించాలని కోరారు. కానీ.. తగిన ఆధారాల్లేవంది డబ్ల్యూహెచ్ వో. ఇప్పుడు గాల్లో వైరస్ ఉంటుందని సీసీఎంబీ ప్రకటించడం గమనార్హం. సో.. ఇకనుంచైనా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ ఉపయోగించడం తప్పనిసరి.