Begin typing your search above and press return to search.

మన రాజకీయాల్లో అలాంటి సీన్ సాధ్యం కాదా?

By:  Tupaki Desk   |   26 March 2020 12:30 PM GMT
మన రాజకీయాల్లో అలాంటి సీన్ సాధ్యం కాదా?
X
చరిత్రలో చాలా అరుదుగా ఎదురయ్యే పరిస్థితి. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాడుతోంది. మందే లేని మహమ్మారితో పోరాటం చేయాల్సిన వేళ.. రోటీన్ రూల్స్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఊహించని కాంబినేషన్లు తెర మీదకు రావాలి. రాజకీయ వైరుధ్యాలు.. విభేదాలు.. శత్రుత్వాల్ని పక్కన పెట్టేయాలి. ఎవరికి ఏ విషయంలో పట్టు ఉందో దాన్ని బయటకు తీసుకునేలా చేయాలి. ఇప్పుడు కావాల్సింది ఉమ్మడి పోరాటమే తప్పించి.. రాజకీయ లబ్ధి కాదు. కరోనా లాంటి వైరస్ మనలాంటి దేశంలో వ్యాప్తి చెంది.. స్టేజ్ త్రీకి వెళితే అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్నది అస్సలు మర్చిపోకూడదు.

అధికారాన్ని చెలాయించాలంటే ముందు.. ఆ అధికారానికి ఆధారమైన ప్రజలు సరిగ్గా ఉండాలి కదా? ఈ చిన్న సూక్ష్మాన్ని గ్రహిస్తే.. ఇప్పుడున్న దానికి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్న నేతలు.. ఈ అపత్ సమయంలో సమర్థులైన రాజకీయ నాయకుల్ని పార్టీలకు అతీతంగా ఒక తాటి మీదకు వచ్చి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. మోడీ.. కేసీఆర్.. జగన్ లాంటి నేతల చేతిలో అధికార పగ్గాలు ఉన్న వేళ.. ఇలాంటివి సాధ్యమా? అన్నది ప్రశ్న.

ఇలాంటివేళే గుర్తుకొస్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సమకాలీన ప్రపంచ రాజకీయాల్లో అధినేతలుగా ఉన్న వారందరిలోనూ ఒక గుణం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమ రాజకీయ ప్రత్యర్థులకు ఉనికి ఉండటానికి కూడా ఇష్టపడని తత్త్వం వీరందరిలో కామన్ గా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కూడా.. కరోనా లాంటి పిశాచితో పోరాడాలంటే తన శక్తి సరిపోదని.. అందరిని కలుపుకుపోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు ట్రంప్. తాజాగా తాను ప్రకటించిన 150 లక్షల కోట్ల రూపాయిల ప్యాకేజీని తాను ఒక్కడే కాకుండా.. ప్రతిపక్ష పార్టీతో కలిసి నిర్ణయం తీసుకోవటం కనిపిస్తుంది.

అదే తీరులో కొన్ని దేశాల్లో.. అధికార.. ప్రతిపక్ష నేతలన్న గీతల్ని తుడిపేసి.. అంతా కలిసి కట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించారు అలాంటిదే మన దేశంలో ఎందుకుఉండకూడదు. ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా కానీ.. రాహుల్ కానీ వీరెవరూ కాదంటే ఎలాంటి మచ్చ లేని మన్మోహన్ ను కలుపుకొని ఎందుకు వ్యూహాల్ని సిద్ధం చేయకూడదు? తెలంగాణ విషయంలో తిరుగులేని నేత కేసీఆర్. ఆయనకు సరిసాటిగా వచ్చే నేత కనిపించకపోవచ్చు. కానీ.. కమిట్ మెంట్ విషయంలో వంక పెట్టలేని ఉత్తమ్.. జానారెడ్డి.. లాంటి వారిని ఎందుకు సీన్లోకి తీసుకురాకూడదు. ఏపీ విషయానికి వస్తే.. సీఎం జగన్ నిర్ణయాలు తీసుకోవటం లేదని చెప్పట్లేదు. అయితే.. ఇలాంటి కీలక సమయాల్లో పాలనా పరంగా అనుభవం ఉన్న చంద్రబాబునాయుడి సేవల్ని ఎందుకు వాడుకోకూడదు?

ఇలాంటి ప్రతిపాదన చేసినోడికి ముఖం పగిలేలా చీవాట్లు పడతాయి. కానీ.. ఇప్పుడున్నది అరుదైన సందర్భమన్నది మర్చిపోకూడదు. మన చుట్టూ ఉన్న.. మనల్ని నమ్మకున్న ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉందన్నది మర్చిపోకూడదు. అలాంటివేళ.. రొడ్డు కొట్టుడు రాజకీయాల్ని వదిలేసి.. ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా.. ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చేసేందుకు అవసరమైన చర్యల కోసం కొత్త కాంబినేషన్లతో కలిసి పని చేస్తే తప్పేముంటుంది? మన దేశంలో నెలకొన్న రాజకీయ వాతావరణంలో.. ఇలాంటి ఆలోచనలు రావటమే మహాపరాధంగా భావించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో?