Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా కట్టడికి ఇలా చేస్తున్నారు

By:  Tupaki Desk   |   17 March 2020 9:30 AM GMT
ఏపీలో కరోనా కట్టడికి ఇలా చేస్తున్నారు
X
పక్క రాష్ట్రం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం.. దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు బాగా లేకపోవడంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ లోనూ పకడ్బందీ చర్యలు చేపట్టారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆదిలోనే గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటే కరోనాకు అడ్డుకట్ట పడుతుందని భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా విజయవాడలోని విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ను క్వారంటైన్‌ సెల్‌ (నిర్బంధ కేంద్రం)గా మార్చనున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఈ భవనాన్ని కరోనా నివారణకు వినియోగించనున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్‌ లో ఉంచేందుకు దీనిని ఉపయోగించనున్నారు. విమాన ప్రయాణికులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాకుండా నేరుగా ఇక్కడే నిర్బంధంలోకి తీసుకుని ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు తరలించి అక్కడ పరిశీలన చేయాలని నిర్ణయించారు. విమానాల్లో ఇక్కడకు వచ్చే ప్రయాణికులు లోపలికి రాగానే రోగ లక్షణాలు ఉన్నాయేమోనని గన్‌మెషిన్‌తో పరిశీలిస్తున్నారు. సిబ్బందికి శానిటైజ్డ్‌ మాస్కులను అందించటం తో పాటు ప్రత్యేకంగా సూట్‌ కూడా అందించారు. ప్రయాణికులు తమ చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజ్డ్‌ ఎక్విప్‌మెంట్‌ను కూడా సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా విమానాశ్రయానికి ప్రత్యేకంగా వైద్యాధికారిని కేటాయించింది. మెడికల్‌ ఆఫీసర్‌ ఉంటే కరోనా లక్షణాలు కలిగిన వారిని నిర్బంధంలోకి తీసుకోవడంతో పాటు, సత్వర వైద్య సేవలు అందించేందుకు వీలవుతుంది. నేటి నుంచి మెడికల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో ఎయిర్‌ పోర్టులో ప్రయాణికులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయనున్నారు. దానికి కావాల్సిన సదుపాయాలు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రైల్వేస్టేషన్‌ లోనూ యాంటీ కరోనా ఆపరేషన్ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రతి షెడ్యూల్లోనూ బెడ్‌, దిండు కవర్లు, కర్టెన్లు మార్చాలని నిర్ణయించారు. ఏసీ, స్లీపర్‌, జనరల్‌ బోగీల్లో సోడియం హైపో క్లోరైడ్‌ స్ర్పే చల్లాలని, రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌.. నిరంతరం అనౌన్స్‌మెంట్‌ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ చర్యలతో పాటు మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు, చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణకు ముందస్తు చర్యలు ప్రభుత్వం చేపట్టింది.