Begin typing your search above and press return to search.

దేశంలో థర్డ్ వేవ్? తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం.. భారీగా కేసులు..

By:  Tupaki Desk   |   15 Jan 2022 6:21 AM GMT
దేశంలో థర్డ్ వేవ్? తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం.. భారీగా కేసులు..
X
దేశంలో థర్డ్ వేవ్ వచ్చినట్టే కనిపిస్తోంది. రోజుకు 8 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోసారి కేంద్రం లాక్ డౌన్ పెట్టే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కల్లోలం చోటుచేసుకుంది. వైరస్ విజృంభిస్తోంది. కేసులు ఉధృతంగా నమోదవుతున్నాయి.

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 39816 నమూనాలు పరీక్షించారు. కొత్తగా 4528 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,93,860కి చేరింది.

ఏపీలో కరోనా బారినపడి ప్రకాషం జిల్లాలో ఒకరు మృతి చెందారు. 418 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2061039కు చేరింది. ఇప్పటివరకూ 14508 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం ఏపీలో 18313 యాక్టివ్ కేసులు న్నాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఏపీలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1027 కేసులు నమోదయ్యాయి. సామాన్యులతోపాటు ప్రముఖులు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

-తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 2398 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 68525 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా వల్ల ముగ్గురు చనిపోయారని.. జీహెచ్ఎంసీ పరిధిలో 1233 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కరోనా వల్ల ఇప్పటివరకూ 4052 మంది చనిపోయారని వైద్యశాఖ తెలిపింది.

-దేశంలో రెండున్నర లక్షలకు పైగా కరోనా కేసులు
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 2,64,202 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా కొత్తగా మరో 315 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,09,345 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.