Begin typing your search above and press return to search.

క‌రోనా సాధార‌ణ జ్వ‌రంగా మారుతుందిః ఏషియ‌న్ డాక్ట‌ర్‌

By:  Tupaki Desk   |   3 July 2021 8:00 AM IST
క‌రోనా సాధార‌ణ జ్వ‌రంగా మారుతుందిః ఏషియ‌న్ డాక్ట‌ర్‌
X
భార‌త దేశానికి క‌రోనా ముప్పు ఇంకా తొల‌గిపోలేద‌ని, థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంద‌నే హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎయిమ్స్ డైరెక్ట‌ర్ వంటివారితోపాటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా థ‌ర్డ్ వేవ్ గురించిన‌ హెచ్చ‌రిక‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. కొంద‌రు మాత్రం ఇందుకు భిన్న‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. థ‌ర్డ్‌ వేవ్ కు అవ‌కాశం లేద‌ని, వ‌చ్చినా.. దాని ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంటున్నారు. తాజాగా.. ఇదే విష‌య‌మై మాట్లాడిన‌.. హైద‌రాబాద్ లోని ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ చైర్మ‌న్‌, ప్ర‌ముఖ వైద్యుడు నాగేశ్వ‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తొలి ద‌శ‌లో వృద్ధుల‌పై ప్ర‌భావం చూపింద‌ని, సెకండ్ వేవ్ యువ‌త మీదుగా వెళ్లిపోయింద‌ని, ఇక‌ థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చూపేది చిన్న పిల్ల‌ల‌పైనే అని చాలా మంది జోస్యం చెప్పుతున్న సంగ‌తి తెలిసిందే. 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ లేదు కాబ‌ట్టి.. వారిపైనే ఎఫెక్ట్ చూపుతుంద‌ని కార‌ణాలు కూడా చెబుతూ వ‌స్తున్నారు. అయితే.. ఇటీవ‌ల‌ ఐసీఎంఆర్ నివేదిక కూడా ఇందుకు విరుద్ధమైన నివేదిక‌ను ఇచ్చింది.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి ఆధార‌ల్లేవ‌ని చెప్పింది. ఒక‌వేళ వ‌చ్చినా.. సెకండ్ వేవ్ అంత తీవ్ర‌త ఉండ‌ద‌ని చెప్పింది. వ్యాక్సినేష‌న్ వేగంగా కొన‌సాగుతున్నందున‌.. వైర‌స్ తీవ్ర స్థాయిలో ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌ని తెలిపింది. అదే స‌మయంలో కేవ‌లం పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్ప‌డానికి కూడా కార‌ణాలు క‌నిపించ‌ట్లేద‌ని చెప్పింది.

ఐసీఎంఆర్ మాత్ర‌మే కాదు.. ఇటీవ‌ల క‌ర్నాట‌క‌లోని ఇద్ద‌రు వైరాల‌జిస్టులు సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. రిటైర్డ్ మైక్రోబ‌యాల‌జీ ప్రొఫెస‌ర్ విజ‌య అంచ‌నా ప్ర‌కారం.. థ‌ర్డ్ వేవ్ అనేది ఒక ఊహ మాత్ర‌మే. దీనికి ఎలాంటి ఆధార‌మూ లేదని అన్నారు. అయితే.. జాగ్ర‌త్త‌గా మాత్రం ఉండాల‌న్నారు. మ‌రో వైరాల‌జిస్టు జాక‌బ్ జాన్ ఓ అడుగు ముందుకు వేసి.. అస‌లు థ‌ర్డ్ వేవ్ అనేది లేనే లేద‌ని అన్నారు. ఈ సంవ‌త్స‌రం ముగిసే నాటికి క‌రోనా పూర్తిగా అంత‌మై పోతుంద‌ని కూడా ఆశాభావం వ్య‌క్తం చేశారు.

వీరి అంచ‌నాల‌కు కొన‌సాగింపుగా.. డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి సైతం ఇదే త‌ర‌హా అభిప్రాయం వ్య‌క్తం చేశారు. గురువారం తెలంగాణ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య నిర్వ‌హించిన వెబినార్ లో.. ‘అందరికీ ఆరోగ్యం’ అనే అంశంపై ఆయ‌న మాట్లాడారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి చూస్తే.. ఇండియాలో థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశ‌మైతే ఉంద‌ని అన్నారు. అది కూడా సెప్టెంబ‌ర్ మాసంలో మొద‌లు కావొచ్చ‌ని అన్నారు. అయితే.. థ‌ర్డ్ వేవ్ తో ఏదో జ‌రుగుతుంద‌ని భ‌య‌ప‌డాల్సిన అవ‌రం లేద‌న్నారు. వైర‌స్ లో తీవ్ర మార్పులు జ‌రిగితే త‌ప్ప‌, అంత ప్ర‌భావం ఉండ‌ద‌న్నారు. వ్యాక్సిన్ వేగం పెంచి, క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. థ‌ర్డ్ వేవ్ నుంచి భ‌య‌ట‌ప‌డొచ్చని చెప్పిన ఆయ‌న‌.. ఏడాది కాలం త‌ర్వాత క‌రోనా కూడా సాధార‌ణ జ్వ‌రంగా మారిపోతుంద‌ని అన్నారు.