Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ లో కుర్రోళ్లపై కరోనా పంజా.. బాధితుల్లో 43 శాతం యువతే!

By:  Tupaki Desk   |   23 April 2021 5:31 AM GMT
సెకండ్ వేవ్ లో కుర్రోళ్లపై కరోనా పంజా.. బాధితుల్లో 43 శాతం యువతే!
X
కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. యువత, చిన్నారులపై పంజా విసురుతోంది. తొలి దశలో యువతపై పెద్దగా ప్రభావం చూపని వైరస్... రెండో దశలో మాత్రం కుర్రోళ్లపై విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 56.4శాతం 40 ఏళ్ల లోపు వారేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారిక గణాంకాలు వెల్లడించింది. 21 నుంచి 40 ఏళ్ల లోపు వారే 43.2 శాతం బాధితులు ఉండడం గమనార్హం.

కుటుంబంలో ఒక్కరికి పాజిటివ్ అయితే త్వరగా అందరికీ సోకుతోంది. అలా బాధితుల్లో యువత, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. విద్య, ఉద్యోగం వంటి కార్యకలాపాల దృష్ట్యా యువత బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మహమ్మారి కోరల్లో చిక్కుతున్నారు. వారిలో కొందరి నిర్లక్ష్యం కారణమేనంటున్నారు నిపుణులు. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, మరికొందరు రోడ్లపై ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల వైరస్ సోకుతోందని చెబుతున్నారు.

పరీక్షల సంఖ్యను పెంచుతున్నారు. కాగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు బాధితుల్లో 20 శాతం మందికి లక్షణాలు ఉంటున్నాయని వైద్యాధికారులు తెలిపారు. చాలామందికి లక్షణాలు ఉండడం లేదని వెల్లడించారు. పదిరోజుల్లోనే పాజిటివ్ రేటు రెట్టింపు అయిందన్నారు. ఒకరి నుంచి ఒకరికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

బయటకు వెళ్లినప్పుడు అందరూ కరోనా నిబంధనలు విధిగా పాటించాలని అంటున్నారు. యువత నిర్లక్ష్యం వహిస్తే వారి కుటుంబం కొవిడ్ బారిన పడాల్సి వస్తోందని హెచ్చరించారు. ఇక కుటుంబమంతా హోం ఐసోలేషన్ లో ఉన్న బాధితులు 14 శాతం ఉంటారని తెలిపారు. బుధవారం నాటికి మొత్తం 49,781 క్రియాశీలక కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఆస్పత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారని వివరించారు.