Begin typing your search above and press return to search.

భయం పుట్టిస్తున్న లేటెస్ట్ కరోనా ఫిగర్స్

By:  Tupaki Desk   |   18 March 2020 10:30 AM GMT
భయం పుట్టిస్తున్న లేటెస్ట్ కరోనా ఫిగర్స్
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన దేశాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. డిసెంబరు చివరి వారంలో చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ విషయంలో భారత్ మొదట్నించి అప్రమత్తత తో ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి చివరి.. మార్చి మొదటి వారాల్లో కాస్తంత ఉదాసీనత ప్రదర్శించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే.. ఇప్పటి పరిస్థితి కారణంగా చెబుతున్నారు. ప్రపంచాన్ని అంతకంతకూ ఆక్రమిస్తున్న ఈ డెడ్లీ వైరస్ తన తీవ్రతను పెంచుతోంది. తాజాగా దేశంలో కరోనాకు గురైన వారి సంఖ్య 147కు చేరుకుంది.

ఇప్పటివరకూ 147 మందిలో కరోనా వైరస్ ను గుర్తించగా.. 130 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 14 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయితే.. ముగ్గురు మరణించారు. తాజాగా వెల్లడైన గణాంకాల్ని చూస్తే..ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఆరు రోజుల క్రితం ఒక్కసారిగా 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటివరకూ రోజుకు ఐదారు కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యేవి. దీనికి భిన్నంగా మార్చి 11న అతి ఎక్కువగా ఒక్కరోజులో 20 కేసులు పాజిటివ్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసులు నిర్దారణ అయినా.. ఇంత భారీగా లేవు. ఆశ్చర్యకరంగా నిన్న (మంగళవారం) 19 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఇక.. ఈ రోజు (బుధవారం) ఉదయం పదకొండు గంటల నాటికే ఎనిమిది కేసులు నమోదైనట్లుగా కేంద్రం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ అంశం కొంత ఆందోళన కలిగించేది కాక.. మరో అంశం కూడా కరోనా వ్యాప్తిపై కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉంది. ఇంకాలం విదేశాల నుంచి వచ్చేవారి కేసులు మాత్రమే పాజిటివ్ గా రాగా.. స్థానికుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు కన్ఫర్మ్ అయిన కేసులు తక్కువగా కనిపించేవి. గడిచిన రెండు మూడు రోజులుగా అవి కాస్తా ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ గా గుర్తించినవి 56 శాతం అయితే.. స్థానికంగా గుర్తించిన కరోనా కేసులు44 శాతానికి చేరుకోవటం ఆందోళన కలిగించక మానదు. స్థానికుల్లో ఎంత తక్కువగా పాజిటివ్ కేసులు నమోదైతే.. అంత సురక్షితంగా ఉన్నట్లు. కానీ.. ఇందుకు భిన్నంగా స్థానికుల కేసులు ఇప్పుడు పాజిటివ్ గా తేలుతున్నాయి.

ఈ రోజు విషయానికే వస్తే.. బుధవారం తొలిసారి పశ్చిమబెంగాల్ లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంగ్లండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాదు.. లద్దాఖ్ లోని భారత ఆర్మీ జవానుకు కరోనా నిర్ధారణ కావటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెబుతున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల తో పోలిస్తే మహారాష్ట్రలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా ఫూణెకు చెందిన 28 ఏళ్ల యువతికి కరోనా కన్ఫర్మ్ చేశారు. మార్చి 15న ఆ యువతి ఫ్రాన్స్.. నెదర్లాండ్ నుంచి ఇండియాకు వచ్చినట్లుగా గుర్తించారు. మహారాష్ట్ర లో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.