Begin typing your search above and press return to search.

ఎర్ర చీమల చట్నీతో కరోనా అంతం..సుప్రీం కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   10 Sept 2021 11:26 AM IST
ఎర్ర చీమల చట్నీతో కరోనా అంతం..సుప్రీం కీలక వ్యాఖ్యలు
X
కరోనా వైరస్ కట్టడికి ఎర్ర చీమల చట్నీని ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సంప్రదాయ జ్ఞానం, ఇంటి చిట్కాలను కరోనా నివారణలో ఉపయోగించాలని ఆదేశించలేమని స్పష్టం చేస్తూ ఆ పిటిషన్‌ ను కొట్టివేసింది. మన దేశంలోని ఏజెన్సీ ప్రాంతాలున్న రాష్ట్రాల్లో ఎర్ర చీమలను రోగనిరోధక ఆహార పదార్ధాలుగా వాడుతున్నారు. ఇందులో ఒడిశా ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో ఉన్న గిరిజిన ప్రాంతాల్లో ఎర్ర చీమలతో చట్నీతో పాటు సూప్ కూడా తయారు చేస్తారు.

దీన్ని తీసుకుంటే ఫ్లూ లక్షణాలున్న వ్యాధులన్నీ మటుమాయం అవుతాయని గిరిజనుల నమ్మకం. ఎర్ర చీమలను పచ్చి మిరపకాయలను కలిపి దీన్ని తయారు చేస్తారు. ఫ్లూ సంబంధిత వ్యాధులకు ఇతర రోగాలకు మందుగా పనిచేస్తున్న ఎర్ర చీమల చట్నీని కరోనాకు మందుగా వాడొచ్చని తాజాగా ఓ ప్రచారం మొదలైంది. ఒడిశాలోని బారిపడ ప్రాంతానికి చెందిన ఇంజనీర్ పరిశోధకుడు నయాథర్ పథియాల్ ఎర్రచీమల చట్నీతో కరోనా తగ్గుతుందని ముందుగా గతేడాడి జూన్లోనే ప్రకటించారు

ఒడిశాలోని గిరిజన తెగకు చెదిన ఓ వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సంప్రదాయ జ్ఞానం, ఇంటి చిట్కాలను కరోనా నివారణలో ఉపయోగించాలని ఆదేశించలేమని పిటిషన్‌ ను కొట్టివేసింది. మన ఇళ్లలో బోల్డంత సంప్రదాయ విజ్ఞానం ఉంది. ఈ చిట్కాలను మనం సొంతంగా ఉపయోగించుకోవచ్చు. దాని పర్యవసానాన్ని వాడినవారే అనుభవించాల్సి ఉంటుంది. మీరు ఉపయోగించాలనుకుంటే అది మీ ఇష్టం, అయితే, రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానంగా దీనిని దేశవ్యాప్తంగా అందరూ ఆచరించాలని మాత్రం మేం ఆదేశించలేం అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని పిటిషనర్‌ ను కోరింది. ఒడిశాలోని బారిపడకు గిరిజన తెగకు చెందిన పిటిషనర్ నయాధర్ పఢియల్‌ తరఫున న్యాయవాది అనిరుధ్ సంగనేరియ వాదనలు వినిపించారు. తాము దాఖలుచేసిన పిటిషన్‌ ను ఒడిశా హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంలో ఛాలెంజ్ చేశామని తెలిపారు. కరోనా రెమిడీ గా ఎర్ర చీమల చట్నీని ఉపయోగించాలన్న ప్రతిపాదనపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆయుష్ మంత్రిత్వశాఖ డైరెక్టర్ జనరల్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ ఐ ఆర్)ను ఒడిశా హైకోర్టు ఆదేశించడంతోనే సమస్య ప్రారంభమైందని ధర్మాసనం పేర్కొంది.

దీనికి తాము ముగింపు పలకాలనుకుంటున్నామని స్పష్టం చేస్తూ పిటిషన్‌ ను కొట్టివేసింది. పిటిషనర్‌ టీకా వేసుకోవాలని సూచించింది. దీనికి స్పందించిన ఆయన తరఫు లాయర్, ఇప్పటికే తన క్లయింట్ టీకా రెండు డోస్‌లు వేసుకున్నాడు మై లార్డ్.. బూస్టర్ డోస్ వేసుకోవాలనే ప్లానింగ్‌ లో ఉన్నారు అని తెలిపారు. ఎర్రచీమలు, పచ్చిమిరపకాయలతో కలిపి చేసే చట్నీని ఒడిశా, చత్తీస్‌ గఢ్‌ సహా పలు రాష్ట్రాల్లోని గిరిజనులు ఔషధంగా భావిస్తారు. ఇది ఫ్లూ, దగ్గు, సాధారణ జలుబు, ఆయాసం, శ్వాసకోశ సమస్యలతోపాటు మరెన్నింటికో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని వారు నమ్ముతారు. ఎర్ర చీమల చట్నీలో ఫార్మిక్ యాసిడ్, ప్రొటీన్, కాల్షియం, విటన్ బి12, జింక్ వంటివి ఉంటాయని, కాబట్టి దీనికి కరోనా వైరస్ ను కూడా నివారించే గుణముందని పిటిషన్ వెల్లడించింది.