Begin typing your search above and press return to search.

పత్రికలకు కరోనా గండం.. చిక్కుల్లో మీడియా

By:  Tupaki Desk   |   22 March 2020 10:07 AM IST
పత్రికలకు కరోనా గండం.. చిక్కుల్లో మీడియా
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే.. ఇప్పుడు కరోనా వంటి అంటువ్యాధి చైనా నుంచి వచ్చి దేశంలో పాకుతుండడం ప్రభుత్వాలు బంద్ నకు పిలుపునివ్వడంతో అంతా ఇళ్లల్లోకి చేరిపోయారు. సామూహిక కరచాలనాలు, కౌగిలింతలు.. అసలు తాకడాలే పాపం అయిపోయింది.

కరోనా అంటువ్యాధి కావడంతో ఒకరినొకరు తాకడం లేదు. ఇతరులు ఇచ్చిన వస్తువులను తీసుకోవడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితి ఇలాగే కొనసాగితే పత్రికలకు కష్టాలు తప్పవన్న చర్చ సాగుతోంది.

పత్రికలు ప్రింట్ అయినప్పటి నుంచి పాఠకుడికి చేరేవరకు ఎంతో మంది చేతులు మారుతుంది. ప్రింటింగ్ చేసే సిబ్బంది నుంచి ప్యాకింగ్ చేసే పనివారు వరకూ అందరూ పేపర్లను తాకుతారు. ఈ పేపర్లను బండిల్స్ చేసి తీసుకెళ్లే వాహనాల యజమానులు తాకుతారు.

ఇక అక్కడి నుంచి దూర ప్రాంతాలకు పేపర్ వెళుతుంది. ఏజెంట్స్ ఈ పేపర్స్ ను మెయిన్, జిల్లా ఎడిషన్లను తీసి కలిపి ఒక రౌండ్ గా చుడతారు.. పేపర్ బాయ్స్ కు ఇస్తారు. వారు చేతిలో పట్టుకొని వినియోగదారుడి ఇంటి ముందు వేస్తారు. అపార్ట్ మెంట్లలో వేస్తే వాచ్ మెన్ పైకి తెచ్చి ఇస్తాడు.

ఇలా పత్రికలు ప్రింటింగ్ నుంచి పాఠకుడికి అందేదాకా ఎంతో మంది చేతులు మారుతుంది. అది కరోనా వైరస్ వ్యాపించడానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంది. కరోనా కనుక విజృంభిస్తే ఎవరూ పేపర్ చూడడానికి తాకడానికి వేయించుకోవడానికి వెనుకాడుతారు. ఇదే జరిగితే పత్రికలకు మరణశాసనమే.. ఇప్పటికే కరోనా కారణంగా యాడ్స్, ప్రకటనలు తగ్గిపోయి ఆదాయం పడిపోయింది. ఆదాయం లేక పత్రికలు నానా కష్టాలు పడుతున్నాయి. కరోనా తగ్గకపోతే పత్రికల మనుగడే కష్టమన్న భావన మీడియా యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది.