Begin typing your search above and press return to search.

నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాళ్లకు పంగనామాలు అంట?

By:  Tupaki Desk   |   23 April 2021 1:30 PM GMT
నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాళ్లకు పంగనామాలు అంట?
X
ఏరుదాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే.. అధికారంలోకి రావడం కోసం ఆ మహిళల సేవలను ఉపయోగించుకున్న వైసీపీ పెద్దలు ఇప్పుడు వారిని పూచిక పుల్లలా తీసేసిన వైనం చర్చనీయాంశమవుతోందట.. వైసీపీ గెలుపు కోసం పోరాడిన ఆ మహిళా నేతలకు ఇప్పుడు ఎలాంటి పదవులు, బాధ్యతలు కనీసం వారి సేవలకు గుర్తింపు కూడా లేని వైనంపై లోలోపల కుమిలిపోతున్నారట.. వీరి గోడు వినే నాథుడే లేకుండా పోతున్నారట..

2009 ఎలక్షన్ కు ముందు జగన్ కు వ్యూహ కర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేసిన విషయం తెలిసిందే. తనకు సంబంధించిన టీం ఏపీలో మకాం వేసి వైసీపీని గాడిలో పడేసేలా ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్లానింగ్ లో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో మహిళను అధ్యక్షురాలిగా ఉంచాలని సూచించారు. వీరి ద్వారా డ్వాక్రా మహిళల డేటా తెప్పించుకొని వారికి అనుకూలంగా ఉండేట్లు నడుచుకోవాలని చెప్పారట. దీంతో కొందరు మహిళలు సమావేశమై ఈ విషయాన్ని పీకే టీం చెప్పిందట.

వైసీపీ అధికారంలోకి రాగానే మీకు ప్రాధాన్యత ఉంటుందని, మీకు సంబంధించిన ప్రతీ ఫైల్ నేరుగా జగన్ వద్దే ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్యే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని, అందువల్ల మీరు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. దీంతో వారు నిజమని నమ్మి ఊరూరా తిరుగుతూ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డారు.

అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నా వారికి ప్రాధాన్యత లేకుండా పోయిందట. అంతేకాకుండా మహిళా అధ్యక్షురాలి పదవి లేనేలేదంటున్నారట. ఈ విషయమై కొందరు పీకే టీంకు ఫోన్ చేయగా మేము ఇప్పుడు ఆ టీంలో పనిచేయడం లేదని అంటున్నారట. దీంతో షాక్ తిన్న వారు ఎవరికి చెప్పుకోలేక లోలోపల మథనపడుతున్నారట. అయితే ఈ విషయంపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.