Begin typing your search above and press return to search.

పెద్ద మనిషి ఎంత చక్కటి మాట చెప్పారు.. కాంగ్రెస్ కు ఇప్పుడు కావాల్సింది ఇదే

By:  Tupaki Desk   |   14 Dec 2020 9:11 AM IST
పెద్ద మనిషి ఎంత చక్కటి మాట చెప్పారు.. కాంగ్రెస్ కు ఇప్పుడు కావాల్సింది ఇదే
X
తోపులాంటి రాజకీయ నాయకుడు కావొచ్చు. కాలంతో పాటు వచ్చే పరిమితుల్ని శ్రద్ధగా గుర్తించినోడికి ఉండే గౌరవం అంతా ఇంతా కాదు. కాసింత అవకాశం లభిస్తే చాలు.. పదవుల కోసం కక్కుర్తిపడేయటం.. అవసరం లేకున్నా రేసులో ఉన్నట్లుగా బడాయి మాటలు చెప్పటం లాంటి చాలామందిలో చూస్తుంటాం. అందునా.. కాంగ్రెస్ లాంటి పార్టీలో పదవి అన్నంతనే.. అదెలాంటిదైనా సరే.. దాని కోసం పడే కక్కుర్తి అంతా ఇంతా కాదు.

అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఒకప్పుడు సీఎల్పీ నేతగా వ్యవహరించిన జానారెడ్డి తాజాగా మిగిలిన సీనియర్లకు భిన్నంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఏ కాంగ్రెస్ నేతను కదిలించినా.. పీసీసీ అధ్యక్ష పదవి తనకే కేటాయించాలన్నట్లుగా వారి మాటలు ఉంటాయి. కానీ.. ఆ మాటకు పార్టీ అధినాయకత్వం ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్నది తెలిసిందే.

ఈ విషయాలపై అవసరమైనంత అవగాహన ఉన్న సీనియర్ నేత జానారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి మీదా ఎలాంటి ఆశ లేదన్నారు. తాను గతంలో ప్రాతినిద్యం వహించిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ ఎవరిని ఎంపిక చేసినా సరే.. తాను వారి గెలపు కోసం పని చేస్తానని చెప్పారు. అంతేకాదు.. పీసీసీ చీఫ్ పదవి మీద తనకు ఆసక్తి లేదని తేల్చేసిన జానా.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో విచిత్రమైన ప్రజాతీర్పు రానున్నట్లు చెప్పారు.

కేసీఆర్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ అనేక హామీల్ని అమలు చేయటంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ముందుకు కదల్లేదన్నారు.గొర్రెల పంపినీ రెండో దశ లేకుండా పోయిందని ఆరోపించిన ఆయన మాటలు సీఎం కేసీఆర్ కు కాస్తంత అసౌకర్యానికి గురి చేస్తుందని చెప్పక తప్పదు. ఏమైనా.. మిగిలిన నేతల మాదిరి కాకుండా పది మందికి సాయం చేసేందుకు వీలుగా జానా చేస్తున్న ప్రయత్నాలు ఆయనపై మరింత గౌరవాన్ని పెంచుతాయని చెప్పక తప్పదు.