Begin typing your search above and press return to search.

ప్రజాపోరాటంతోనే రాజు చచ్చాడు.. అతని కుటుంబాన్ని మాత్రం ఆదుకోవాలన్న సీతక్క

By:  Tupaki Desk   |   17 Sept 2021 12:00 PM IST
ప్రజాపోరాటంతోనే రాజు చచ్చాడు.. అతని కుటుంబాన్ని మాత్రం ఆదుకోవాలన్న సీతక్క
X
సైదాబాద్ లోని ఆరేళ్ల చిన్నారిని హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు కథ ఆత్మహత్యతో ముగియటం తెలిసిందే. రైలు పట్టాల మీద అతడి డెడ్ బాడీ కనిపించటం తెలిసిందే. ఈ నెల తొమ్మిదిన బాలిక మీద హత్యాచారం చేసిన నిందితుడి కథ.. ఎనిమిది రోజుల తర్వాత పట్టాల మీద విగతజీవిలా దర్శనమివ్వటం తెలిసిందే. రాజు ఆత్మహత్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు.

ప్రజా పోరాటాలతోనే నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ప్రజల ఆగ్రహాంతో వెన్నులో వణుకు పుట్టిన అతను సూసైడ్ చేసుకున్నాడని.. ఇది ప్రజల విజయంగా అభివర్ణించారు. గడిచిన వారం రోజులుగా చైత్ర కుటుంబానికి న్యాయం జరగాలని.. రాజునుకఠినంగా శిక్షించాలని పోరాటాలు జరుగుతున్న వైనాన్ని గుర్తు చేశారు. ఈ కేసును తప్పు దారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించిన ఆమె.. భవిష్యత్తులోనూ ఎవరైనా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే ఇదే గతి పడుతుందన్నారు.

ప్రభుత్వాలు స్పందించినా.. స్పందించకున్నా ప్రజా పోరాటాల కారణంగా ఇలానే చావాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీతక్క.. అతడి తప్పులతో సంబంధం లేని రాజు భార్యను.. ఆమె బిడ్డను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. నిందితుడి ఆత్మహత్యను పూర్తిగా సమర్థించిన సీతక్క.. నిందితుడి కుటుంబాన్ని కాపాడాలంటూ చేసిన విన్నపంపై ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి. నిందితుడి కోసం దాదాపు వెయ్యి మంది పోలీసులు 17 టీంలుగా ఏర్పడి గాలింపులు జరిపారు. చివరకు విగతజీవిగా రైలు పట్టాల మీద దర్శనమిచ్చాడు.