Begin typing your search above and press return to search.

ఈ సీటుపై కాంగ్రెస్ సీనియర్‌ నేతల కన్ను

By:  Tupaki Desk   |   17 Feb 2019 9:53 AM IST
ఈ సీటుపై కాంగ్రెస్ సీనియర్‌ నేతల కన్ను
X
గత డిసెంబర్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ ఎస్‌ విజయభేరి మోగించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసినా ఖమ్మం జిల్లాలో మాత్రం తేలిపోయింది. కేవలం ఒక్కసీటు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసింది. దీంతో త్వరలో రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సీనియర్‌ నాయకులు పోటీ పడుతున్నారు. ఆంధ్ర సరిహద్దుతో పాటు టీడీపీ బలం కూడా ఉండడంతో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తే విజయం ఖాయమని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఖమ్మం సీటు దక్కించుకునేందుకు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లోక్‌ సభకు వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. అలాగే గత ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ విజయశాంతి సైతం ఈ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.

ఇక కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న రేవంత్‌ రెడ్డి కూడా ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నాడట. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. దీంతో ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తే గెలిచి తన సత్తా నిరూపించుకోవచ్చని చూస్తున్నాడు. ఇందుకోసం పార్టీ నాయకులతో సమావేశాలు కూడా నిర్వహించాడట. మరోవైపు నిజామాబాద్‌ కంటే ఖమ్మం నుంచి పోటీ చేస్తే గెలువవచ్చని మధుయాష్కి గౌడ్‌ ఆలోచిస్తున్నాడట. నిజమాబాద్‌ లో కవిత నుంచి తీవ్ర పోటీ ఉన్నందున ఆయన సైతం ఖమ్మం వైపే దృష్డి పెడుతున్నాడు.

ఖమ్మం ఎంపీ సీటుపై పెరుగుతున్న ఒత్తిడిపై స్థానిక నేత రేణుకా చౌదరి స్పందించారు. ఈ స్థానంలో తనకు సీటు కేటాయించకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని సొంత పార్టీనే హెచ్చరించారు. ఈమేరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఖమ్మం సీటు ఇవ్వకపోతే తాడో పేడో తేల్చుకుంటానని చెప్పారు. మా ఇలాకాలో మీ హడావుడి ఏంటని సీనియర్‌ నేతలపై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు ఎవరికి కేటాయిస్తారోననే కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్కంఠ మొదలైంది.