Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అస్సాంను గుర్తించలేకపోయింది ,అడ్డంగా దొరికిన కాంగ్రెస్ ... బీజేపీ సెటైర్లు !

By:  Tupaki Desk   |   5 March 2021 7:32 AM GMT
కాంగ్రెస్ అస్సాంను గుర్తించలేకపోయింది ,అడ్డంగా దొరికిన కాంగ్రెస్ ... బీజేపీ సెటైర్లు !
X
ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోలాహాలం నడుస్తుంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా అధికారమే ద్యేయంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే , కాంగ్రెస్ మాత్రం మరోసారి సోషల్ మీడియా వేదికగా అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఏమైంది అంటే .. అస్సాం శాసన సభ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ వాడుతున్న ఫొటోలు తైవాన్ తేయాకు తోటకు సంబంధించినవని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. అస్సాం సౌందర్యాన్ని కాంగ్రెస్ గుర్తించలేకపోతోందని విమర్శలు కురిపించింది.

అస్సాం బచావో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పెట్టిన రెండు ఫొటోలను అస్సాం ఆర్థిక మంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ గురువారం ఇచ్చిన రెండు ట్వీట్లలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు తైవాన్ తేయాకు తోటలో తీసినవని ఆరోపించారు. శర్మ ఇచ్చిన మొదటి ట్వీట్‌లో అస్సాంను కాపాడాలంటూ తైవాన్ తేయాకు తోట ఫొటోను కాంగ్రెస్ అధికారిక ప్రచార పేజ్‌ లో వాడుతున్నారు. కాంగ్రెస్ నేతలు అస్సాంను గుర్తించలేరా? ఇది అస్సాంకు అవమానకరం, మన రాష్ట్ర తేయాకు తోటల కార్మికులకు అవమానకరం అని మండిపడ్డారు. మరో ట్వీట్ లో ‌.. మొదట కాంగ్రెస్ అస్సాంను గుర్తించలేకపోయింది, ఇప్పుడు అస్సామీలను సైతం గుర్తించలేకపోతోంది. ఇది కూడా తైవాన్ ఫొటోయే. కాంగ్రెస్ నేతలు అస్సాంను మర్చిపోయారు. మన గడ్డ ఎంత సుందరమైనదో కాంగ్రెస్‌ కు చూపిద్దాం అని తెలిపారు.

హిమంత బిశ్వ శర్మ ఆరోపణలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ నేత బొబీత శర్మ మాట్లాడుతూ, బీజేపీ కలవరపడుతోందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ‌కు చేరువవుతున్నారని, అభివృద్ధి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ వాగ్దానాల ఆట ముగిసిన తర్వాత అస్సామీలకు చెప్పడానికి ఆ పార్టీకి ఏమీ మిగల్లేదన్నారు. అందుకే కాంగ్రెస్ ‌కు వ్యతిరేకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే .. 126 స్థానాలున్న అస్సాం శాసన సభ ఎన్నికలు మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.