Begin typing your search above and press return to search.

అమరావతి ఉద్యమకారుల్లో అయోమయం

By:  Tupaki Desk   |   23 Oct 2020 9:45 AM IST
అమరావతి ఉద్యమకారుల్లో అయోమయం
X
అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారుల్లో అయోమయం స్పష్టంగా కనబడుతోంది. ఒకవైపు అమరావతిని కాపాడాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వ మద్దతుతోనే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటుకు ముందుకెళుతున్నట్లు మండిపడుతున్నారు. అంటే అమరావతి ఆందోళనకారుల్లో ఎంతటి అయోమయం ఉందో అర్ధమైపోతోంది. నిజానికి అమరావతి శంకుస్దాపనకు నరేంద్రమోడి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణంలో పెద్దగా పురోగతి కనబడలేదు.

దాదాపు నాలుగేళ్ళ విలువైన సమయాన్ని చంద్రబాబానాయుడు రాజధాని నిర్మాణం పేరుతో ఆర్కిటెక్టులని, ప్లాన్లంటూ గ్రాఫిక్స్ తో కాలం గడిపేశారు. విదేశాల్లోని రాజధానుల పరిశీలన పేరుతో సుమారు 18 దేశాలు తిరిగారు. చంద్రబాబు తిరగటమే కాకుండా విదేశాల అధ్యయనం పేరుతో ఉన్నతాధికారుల బృందాలను కూడా విదేశాలకు తిప్పారు. మొత్తం మీద తన హయాంలో చంద్రబాబు పలు భవనాలు కట్టినా... తానే వాటిని తాత్కాలిక భవనాలు అనుకుని, అదే విషయం బయటకు చెప్పవడం ద్వారా జనం ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు.

సరే అసలు పాయింట్ లోకి వస్తే మోడి శంకుస్ధాపన చేసిన తర్వాత చంద్రబాబు నాలుగేళ్ళు వృధా చేశారనే ఆరోపణలను వైసీపీ నేతలు చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ మోడి శంకుస్ధాపన చేసిన తర్వాత చంద్రబాబు రాజధానిని ఎందుకు నిర్మించలేదని సూటిగా ప్రశ్నించటం గమనార్హం. శంకుస్ధాపన చేయటం వరకే మోడి పనికానీ అమరావతిని కాపాడటం కాదన్న విషయం ఎప్పుడో స్పష్టమైపోయింది. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల వివాదం కోర్టుమెట్లెక్కింది.

కోర్టు విచారణలోనే రాజధాని విషయంలో జోక్యం చేసుకునేది లేదని కేంద్రం స్పష్టంగా మూడుసార్లు అఫిడవిట్లు దాఖలు చేసింది. అంటే అమరావతి ఉద్యమం ఎన్నివందల రోజులు జరిగినా మోడి జోక్యం ఉండదని స్పష్టమైపోయింది. ఈ విషయం ఆందోళనలు చేస్తున్నవాళ్ళకు కూడా బాగా తెలుసు. మరి తెలిసిన తర్వాత కూడా అమరావతికి మద్దతుగా మోడి జోక్యం చేసుకోవాలని అడగంటలో అర్ధంలేదు. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం మద్దతుతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఆందోళనకారులే ఆరోపిస్తున్నారు.

అదే నిజమైతే ఆందోళనకారులు ఎంత గొంతుచించుకున్నా మోడి పట్టించుకోరన్న విషయం వాళ్ళకు తెలుసనే అనుకోవాలి. మరి మళ్ళీ మోడి జోక్యం చేసుకోవాలని కోరటం ఎందుకు ? కాబట్టి తమ ఉద్యమం విషయంలో ఏమి చేయాలో ఆందోళనకారులే డిసైడ్ చేసుకోవాలి. ఎక్కడో ఉన్న మోడిని అడిగేబదులు రాజకీయాలను పక్కనపెట్టేసి రైతులు, జనాలు మాట్లాడుకుని జగన్ తోనే చర్చలు జరిపితే తమ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోగలరో ఆలోచిస్తే బాగుంటుంది.