Begin typing your search above and press return to search.

సుహాసిని ఇది ఏమి... !

By:  Tupaki Desk   |   24 Nov 2018 6:55 AM GMT
సుహాసిని ఇది ఏమి... !
X
కుకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా హఠాత్తుగా తెర పైకి వచ్చిన నందమూరి సుహాసిని వైఖరి తెలుగుదేశం నాయకులకు చికాకు తెప్పిస్తోందట. కూకట్‌ పల్లి నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నుంచి చాలా మంది ముందుకు వచ్చారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్‌ పల్లిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఇక్కడ సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని అన్ని పార్టీలు భావించాయి. దీంతోపాటు సిట్టింగ్ ఎమ్యెల్యే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోవడంతో సెటిలర్ల ఓట్లు మహాకూటమికే పడతాయని నిర్ధారణకు వచ్చారు. ఇది కూడా అభ్యర్దులలో పోటీని పెంచింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు - మాజీ మంత్రి - సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి తెలుగుదేశం అభ్యర్దిగా తనకు తాను ప్రకటించుకుని ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే చంద్రబాబు నాయుడి చాణక్యం కారణంగా నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూకట్‌ పల్లి బరిలో నిలిచారు.

నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచు కావడం - ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన హరిక్రిష్ణ కుమార్తె కూడా కావడంతో సుహాసిని రాకను తెలుగుదేశం నాయకులు ఆహ్వానించారు. నామినేషన్ వేసిన అనంతరం నందమూరి సుహాసిని వ్యవహరిస్తున్న తీరు స్దానిక నాయకులను ఇబ్బందుల పాలు చేస్తోందట. నియోజకవర్గంలో ఏ ఒక్కరితోనూ ఆమెకు సఖ్యత కుదరటం లేదని ప్రచారంలో ఒంటెద్దు పోకడలు పోతున్నారని అంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బలంగా ఉండడంతో మహాకూటమి అన్ని పక్షాలతోను కలసి మెలసి ఉండాలని ఎంత చెప్పినా సుహాసిని తీరులో మాత్రం మార్పు రావడం లేదట.

రాజకీయాలకు కొత్త కావడం మహాకూటమి శ్రేణులను ఇబ్బంది పెడుతోందని చెప్తున్నారు. దీనిపై కొందరు నాయకులు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారని చెబుతున్నారు. తాను హైదారబాదు వస్తానని ఆ సమయంలో అందరితో చర్చించి సానుకూల వాతవరణాన్ని తీసుకుని వస్తానని అంతవరకూ అందరూ కలసికట్టుగా పనిచేసి సుహాసిని విజయానికి కృషి చేయాలని సూచించినట్లు చెప్తున్నారు. ప్రచారంలో ఓటర్లును కలిసే సమయంలో సుహాసిని వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని - ఓటర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని - స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ సీనియర్ నేతల‌కు ఫిర్యాదు చేసారని సమాచారం. సుహాసిని తీరు మార్చుకోకపోతే ఈ ఎన్నికలలో విజయం అసాధ్యమేనని కొందరు తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు.