Begin typing your search above and press return to search.

మేయర్ రేసులో మహిళామణుల మధ్య పోటీ.. చివరకు దక్కేదెవరికి?

By:  Tupaki Desk   |   22 Nov 2020 9:00 AM IST
మేయర్ రేసులో మహిళామణుల మధ్య పోటీ.. చివరకు దక్కేదెవరికి?
X
గ్రేటర్ హైదరాబాద్ కు జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడెంత ఆసక్తికరంగా మారాయో తెలిసిందే. ఈసారి మేయర్ పీఠం మహిళా జనరల్ కావటంతో మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీకి చెందిన పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులు రేసులోకి వచ్చేశారు. పైపైన లెక్కిస్తేనే దాదాపుగా డజను మంది అభ్యర్థులు.. తాము మేయర్ పదవికి అర్హులమని భావిస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. రాజకీయ వారసత్వంగా పదవుల్ని ప్రోత్సహించకూడదన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయ కుటుంబాల్లో ఎవరికి మేయర్ పదవిని అప్పజెప్పినా.. తలనొప్పులు ఖాయమన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ వాదనను పలువురు నేతలు కొట్టిపారేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకే మేయర్ పీఠం ఖాయమని చెప్పుకుంటున్నవారు లేకపోలేదు.

మేయర్ రేసులో ఉన్న ప్రముఖ మహిళామణుల విషయానికి వస్తే.. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా చెప్పే రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. మేయర్ పదవికి ముఖ్య పోటీదారుగా అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా మేయర్ పదవి తనకు దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. అంత అవకాశం లేదన్న మాట చెబుతున్నారు.

ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ తన సతీమణి బొంతు శ్రీదేవికి టికెట్టు ఇప్పించుకోవటంలో సఫలమయ్యారు. దీంతో.. ఆమె పేరు మేయర్ రేసులోకి వచ్చింది. అయితే.. ఇప్పటివరకు మేయర్ గా ఉన్న నేత సతీమణికి మళ్లీ మేయర్ పదవిని కేటాయించే అవకాశాలు స్వల్పమని చెప్పక తప్పదు. ఇక.. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నారెడ్డి.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యల పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. వారికి టికెట్లు ఖరారే పెద్ద ప్రయాసగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి కోడలు సుసరితా రెడ్డి..మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి.. ఎల్ బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిన రామ్మోహన్ గౌడ్ సతీమణి శ్రీలత.. టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత మోతె శోభన్ రెడ్డి సతీమణి శ్రీలత కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మరికొందరు పేర్లు వినిపిస్తున్నా.. అవన్నీ ప్రచారమే తప్పించి అసలు అభ్యర్థి వేరే ఉంటారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ఇమేజ్ లేకుండా.. పార్టీకోసం ఉద్యమ సమయం నుంచి పని చేసిన వారికి మేయర్ పీఠం దక్కే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మేయర్ పీఠంపై ఎవరు కూర్చోవాలన్న విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పక తప్పదు.