Begin typing your search above and press return to search.

ఏలూరులో వణికిస్తున్న వింత వ్యాధి .. కలెక్టర్ నివేదిక , కీలక అంశాలు వెల్లడి !

By:  Tupaki Desk   |   7 Dec 2020 9:14 AM GMT
ఏలూరులో వణికిస్తున్న వింత వ్యాధి .. కలెక్టర్ నివేదిక , కీలక అంశాలు వెల్లడి !
X
ఏలూరు లో అంతు చిక్కని వ్యాధితో స్థానికులు భయంతో గజగజ వణికిపోతున్నారు. క్రమంగా ఆ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా, మూర్ఛ, కళ్లుతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో మరికొంత మంది ఈ రోజు ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న మొత్తం బాధితుల సంఖ్య 345కు చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఏలూరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందింంచాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు పెరుగుతున్నారు. మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇక ఈ వ్యాధి నుండి కోలుకొని ఇప్పటివరకు 180 మంది డిశ్ఛార్జి అయ్యారు.

ఏలూరు వింత వ్యాధి ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ నివేదిక సిద్ధం చేశారు. ఇప్పటివరకూ వింత వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదన్నారు. అయితే, ఏలూరు పరిసరాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. బాధితులకు మూర్ఛ ఒకసారి మాత్రమే వస్తోందన్నారు. మున్సిపల్‌ నీరు పంపిణీలేని ప్రాంతాల్లోని జనం కూడా అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. నిత్యం మినరల్‌ వాటర్‌ తాగే వాళ్లు కూడా అస్వస్థతకు గురయ్యారన్నారు. నీటి శాంపిల్స్‌, రక్త నమూనాల రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయన్నారు. ఇంకా కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉందని నివేదికలో కలెక్టర్‌ వెల్లడించారు. అలాగే, ఏలూరు వ్యాప్తంగా కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థతకు గురైనట్టు గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు.సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ విశ్లేషణకోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించారు.. వాటి ఫలితం రావాల్సి ఉంది.

62 గ్రామ, వార్డు సచివాలయాలు సర్వేలోపాల్గొన్నాయి. 57,863 కుటుంబాల్లో ఉన్నవారిపై ఆరోగ్య సర్వే చేశారు. కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థులను గుర్తించారు. వీరందరినీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చికిత్స అందిస్తున్న స్పెషలిస్టులు సహా 56 మంది డాక్టర్లు.. మైక్రో బయాలజిస్ట్‌ లు 3.. నర్సులు 13 మంది, ఎఫ్‌ఎన్‌ఓలు 117, ఎంఎన్‌ఓలు99, అంబులెన్స్‌ లు సేవలందిస్తున్నాయి. విజయవాడకు ఇప్పటివరకూ 7గురు తరలింపు.. అందరి పరిస్థితి స్థిరంగా ఉందనితన నివేదికలో పొందుపరిచారు. ఈ ఆరోగ్య సమస్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ బృందం ఇప్పటికే నమూనాలను సేకరించింది. మరిన్ని పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ లోని ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు.