Begin typing your search above and press return to search.

ఏలూరు బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శ ... అండగా ఉంటామని హామీ !

By:  Tupaki Desk   |   7 Dec 2020 1:16 PM IST
ఏలూరు బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శ ... అండగా ఉంటామని హామీ !
X
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో చాలామంది అల్లాడిపోతున్నారు. అసలు వారికి ఏ వ్యాధి వచ్చిందో కూడా ఇంకా తెలియడంలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులతో స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి బెడ్‌ పై ఉన్న ఓ బాలుడిని సీఎం జగన్ పరామర్శించగా... అతను రెండు చేతులెత్తి నమస్కరించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలుడిని వారించిన జగన్ అతని నదుటిపై ముద్దు పెట్టాడు. బాధితులంతా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉటుందని జగన్ వారికి భరోసానిచ్చారు.

ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్‌ ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ఇప్పటివరకూ ఏలూరులో 345 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 28 మంది బాధితులు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. బాధితుల్లో 180 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యులు వెల్లడించారు.

శనివారం ఏలూరు పట్టణంలోని పడమరవీధి,తాపీమేస్త్రీ కాలనీ,శనివారం పేట,ఆదివారం పేట,కొత్తపేట,అరుంధతీ పేట స్థానికులు అస్వస్థతకు గురవగా... ఆదివారం మరికొన్ని కాలనీలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఎవరికి ప్రాణాపాయం లేదని అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కాసేపట్లో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, మూర్ఛ, కళ్లుతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో మరికొంత మంది ఈ రోజు ఆసుపత్రుల్లో చేరారు.