Begin typing your search above and press return to search.

కొత్త రెవెన్యూ చట్టం.. ప్రజలకు కేసీఆర్ హామీ!

By:  Tupaki Desk   |   9 Sep 2020 9:10 AM GMT
కొత్త రెవెన్యూ చట్టం.. ప్రజలకు కేసీఆర్ హామీ!
X
తెలంగాణ ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ రద్దుతో ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదు అని.. నాదీ గ్యారెంటీ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

బుధవారం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌‌ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్త చట్టం ఒక విధంగా తెలంగాణ రైతులకు ఇది శుభవార్తేనని అన్నారు. ఈ చట్టం ప్రకారం.. ఇక ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదన్నారు.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న నూతన రెవెన్యూ చట్టం బిల్లు వివరాలను కేసీఆర్‌‌ వెల్లడించారు.

‘‘అన్ని వివరాలతో కూడిన ధరణి పోర్టల్ రూపొందించాం. తెలంగాణ విస్తీర్ణం లక్షా 12వేల చ.కి.మీ. అంటే 2 కోట్ల 75 లక్షల ఎకరాలు. మన రాష్ట్రంలో కోటి 50 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది. 66.56 లక్షల అటవీ భూమి ఉంది. మిగిలింది వ్యవసాయేతర భూమి. ధరణి వెబ్‌సైట్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. కాపీ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెక్రటేరియెట్‌, అన్ని కలెక్టరేట్లతో పాటు దేశంలోని ఇతర సురక్షిత ప్రాంతాల్లోనూ సర్వర్లు ఉంటాయి. కొత్త చట్టం ప్రకారం ఏ స్థాయి అధికారికైనా విచక్షణాధికారం ఉండదు. ఏ స్థాయి వ్యక్తైనా ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఈసీ వివరాలు కూడా వెబ్‌సైట్‌లోనే లభిస్తాయి. దేనిపడితే దాన్ని అధికారులు రిజిస్ట్రేషన్ చేసే వీలుండదు. ఆటో లాక్ సదుపాయం ఉంది’ అంటూ

ఈ చట్ట ప్రకారం తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రతి సర్వే నెంబర్‌కు కో ఆర్డినేట్స్ ఏర్పాటు చేస్తామని.. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంశాలుగా కొలతలు నిర్దేశిస్తారని వెల్లడించారు. ఈ చట్టం వచ్చాక భూమి కోసం ఎవరూ గొడవ పడే ఘటనలు ఉండబోవని భరోసా ఇచ్చారు. రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు.

మంగళవారం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌‌.. వెంటనే వారి నుంచి ఫైల్స్‌ను సేకరించారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఇక తమ భవిష్యత్‌ ఏంటని అందరూ ఆందోళనలో పడ్డారు. వారి ఆందోళనలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వారికి ఊపిరిపోశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ప్రకటించారు. రెవెన్యూ సంస్కరణలతో ఇబ్బందులు తొలగుతాయి తప్ప ఉద్యోగులకు వచ్చిన నష్టం ఏం లేదని చెప్పారు. వీఆర్వోలను స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. స్థాయికి తగ్గట్లు వీఏవోలకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌‌ భరోసా ఇచ్చారు.

రెవెన్యూ అదికారులపై గతంలో అనేక దాడులు జరిగాయని.. పీవీ, ఎన్టీఆర్‌‌, చంద్రబాబు, వైఎస్సార్‌‌ హయాంలో కొన్ని మార్పులు జరిగాయని.. అయినా గత పాలకులు రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత మూడేళ్లుగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెవెన్యూలో అవినీతి పెరిగిపోయింది. ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించేందుకు ఈ మా ప్రయత్నమని చెప్పుకొచ్చారు.