Begin typing your search above and press return to search.

ఢిల్లీకి పయనమైన సీఎం కేసీఆర్ .. కేంద్రమంత్రులతో భేటీ !

By:  Tupaki Desk   |   11 Dec 2020 2:07 PM IST
ఢిల్లీకి పయనమైన సీఎం కేసీఆర్ .. కేంద్రమంత్రులతో భేటీ !
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో మూడు రోజులపాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. గత కొన్ని రోజులుగా పెండిగ్‌ లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం కేంద్ర జల‌వ‌న‌రు‌ల‌శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకా‌వ‌త్‌ను, శనివారం పౌర‌ వి‌మా‌న‌యాన, హౌసింగ్‌ ‌శా‌ఖల మంత్రి హర్దీ‌ప్‌‌ సింగ్‌ పురిని కలు‌వ‌ను‌న్నట్టు సమా‌చారం. ఈ ఇద్దరు మంత్రు‌లతో భేటీకి సంబం‌ధిం‌చిన షెడ్యూల్‌ ఖరా‌రై‌నట్టు తెలి‌సింది.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండడం చర్చనీయంశమైంది. ముందు నుంచీ ఈ చట్టాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు కూడా తెలిపారు. ఐతే ఢిల్లీ పర్యటనలో భాగంగా రైతు సంఘాల నేతలతోనూ సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఢిల్లీ లో టీఆర్ఎస్‌ భవన్‌ కు కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించనున్నారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ ఖారారయితే ప్రధాని నరేంద్ర మోదీ తోనూ సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. తిరిగి ఆదివారం సాయంత్రం ఆయన హైద‌రా‌బా‌ద్‌ కు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. అదేవిధంగా కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఇక , ఢిల్లీ లో టీఆర్ ఎస్ భవన్ నిర్మాణానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. దీని కోసం కేంద్రం వసంత్ విహార్ ఏరియాలో వెయ్యి జాల స్థలం కేటాయించింది. స్థలానికి గజం రూ.50 వేల చొప్పున మొత్తం రూ.5 కోట్లు ఖర్చయినట్లు టీఆర్ ఎస్ లీడర్లు గతంలో ప్రకటించారు కూడా. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో , ఆ స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఆ తర్వాత పార్టీ ఆఫీసు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారని సమాచారం.