Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన కరోనా సలహాలేంటి?

By:  Tupaki Desk   |   21 March 2020 7:01 AM GMT
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన కరోనా సలహాలేంటి?
X
మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. కొన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించాల్సిందే. తనకు అవగాహన లేని అంశం మీద పూర్తి స్థాయి పట్టు తెచ్చుకునేందుకు పడే తపన.. చేసే ప్రాక్టీస్ అంతా ఇంతా అన్నట్లు ఉండదు. తనను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడరు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంలో కరోనా మీద తనకున్న అవగాహన తక్కువేనని.. తనకు ఒక సైంటిస్టు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా చెప్పారు.

కట్ చేస్తే.. రెండు రోజుల క్రితం కరోనా పై అత్యవసర రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను నిశితంగా పరిశీలిస్తే.. తొలి ప్రెస్ మీట్ కు.. మలి ప్రెస్ మీట్ వరకూ చూస్తే..కరోనా మీద ఆయన సాధించిన పట్టు స్పష్టంగా కనిపించటమే కాదు.. ఏమేం చేయాలి? ఎలా చేయాలి? ఏ అంశానికి ఎంత మాత్రం స్పందించాలి? లాంటి విషయాల్లో తనకున్న సాధికారితను తన మాటలతోనే చెప్పేశారు.

తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా భేటీ కావటం తెలిసిందే. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఏమేం చేయాలన్న దాని పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసుల ప్రస్తావనతో పాటు.. కరోనా నిర్దారణ పరీక్షలకు తాకిడి ఎక్కువ అవుతున్న అంశాలు చర్చకు వచ్చాయి. ఇలాంటివేళ.. ప్రధాని మోడీకి సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్.

తాను ఏ విషయం మీద మాట్లాడినా.. పూర్తి పట్టు ఉంటే తప్పించి.. అనవసరమైన సంభాషణలు చేసే అలవాటు లేని కేసీఆర్.. అందుకు తగ్గట్లే ఆయన తాజా సలహా ఉందంటున్నారు. ఒక విధంగా చూస్తే.. ప్రధాని మోడీ మీద భారాన్ని తగ్గించేలా సదరు ఐడియా ఉందని చెప్పాలి. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా హైదరాబాద్ లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ సింఫుల్ గా చెప్పాలంటే.. సీసీఎంబీని వినియోగించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు.

నిర్దారణ పరీక్షలు ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఇతర రాష్ట్రాల వారు కూడా వినియోగించుకునే వీలుందని.. కేంద్రం అధీనంలో పని చేసే ఈ సంస్థలో ఒకేసారి వెయ్యి శాంపిల్స్ పరీక్షించే సత్తా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిజానికి.. రోజురోజుకి పెరుగుతున్న కరోనా నిర్దారిత పరీక్షల భారం ల్యాబుల మీద పడుతున్న వేళ.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన సలహా సాయం చేస్తుందని చెప్పక తప్పదు. మరి.. సారు ఇచ్చిన సలహా మీద ప్రధాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.