Begin typing your search above and press return to search.

3 రోజుల కడప టూర్ లో సీఎం జగన్ ఏమన్నారు?

By:  Tupaki Desk   |   24 Dec 2021 1:00 PM IST
3 రోజుల కడప టూర్ లో సీఎం జగన్ ఏమన్నారు?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపలో తాజాగా పర్యటిస్తున్నారు. మూడు రోజుల కడప జిల్లా టూర్ లోనే ఆయన క్రిస్మస్ వేడుకల్ని చేసుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా తొలి రోజున ప్రొద్దుటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా పలు డెవలప్ మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు.

కడప ప్రజలు తనను గుండెల్లో దాచుకున్నారని.. అందుకు ప్రతిఫలంగా తాను డెవలప్ మెంట్ చేసి చూపిస్తానని చెప్పారు. ప్రతిసారీ తనను ఆశీర్వదిస్తున్న కడప ప్రజలకు తాను రుణపడి ఉంటానని చెప్పిన ఆయన.. ప్రొద్దుటూరు పట్టణంలో రూ.515 కోట్లతో తొమ్మిది అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు రూ.200 కోట్లతో 500 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు ఖర్చు చేశామన్నారు. ఈ భూమిని 22,212 మంది అక్కాచెల్లెళ్లకు పట్టాల రూపంలో అందించామన్నారు.

అంతేకాదు.. మొదటి విడతలో భాగంగా 10,828 మందికి ఇళ్లను ఇచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించటమే కాదు.. డెవలప్ మెంట్ కూడా చేసి చూపిస్తున్నట్లు చెప్పారు. ప్రొద్దుటూరులో తాగునీటి సరఫరా కోసం రూ.119 కోట్లతో నూతన పైప్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రూ.163 కోట్లతో నూతన డ్రైనేజీవ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. ప్రొద్దుటూరు నుంచి ఇతర ప్రాంతాలకు సులువుగా చేరుకునేందుకు వీలుగా పెన్నా నదిపై రూ.53 కోట్లతో హైలెవల్ వంతెనను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

అన్నమయ్య ప్రాజెక్టు విషాదంలో ఇళ్లు.. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటటామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గురువారం ప్రొద్దుటూరులో పర్యటించిన ఆయన శుక్రవారం ఇడుపల పాయలోని వైఎస్సార్ ఘాట్ కు చేరుకొని.. తండ్రికి నివాళులు అర్పిస్తారు. అనంతరం పులివెందులకు చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. క్రిస్మస్ రోజున పులివెందులలోని చర్చిలో కుటుంబంతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని.. అనంతరం గన్నవరానికి బయలుదేరుతారు. మొత్తంగా క్రిస్మస్ సందర్భంగా సొంతూరుకు రావటమే కాదు.. వచ్చిన సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టటం జిల్లా వాసుల్ని అలరిస్తోంది.