Begin typing your search above and press return to search.

'అమ్మఒడి' కి ఎందుకు స్పందన కరువైంది?

By:  Tupaki Desk   |   10 Jan 2020 10:19 AM GMT
అమ్మఒడి కి ఎందుకు స్పందన కరువైంది?
X
వత్రం చెడ్డ ఫలితం దక్కాలంటారు.. కానీ ఇప్పుడు సీఎం జగన్ ఎంతో కష్టనష్టాలకు ఓర్చి, నిధులను సమకూర్చి దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో ప్రవేశ పెట్టిన ‘అమ్మఒడి’ పథకానికి ఆశించిన స్పందన లేదన్న బాధ వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది.

నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం దేశంలో ఏ సీఎం కూడా సాహసించని రీతిలో ‘అమ్మఒడి’ పథకానికి శ్రీకారం చుట్టి జగన్ ఎంతో సాహసం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు సంవత్సరానికి రూ.12వేలు చెల్లించడంతోపాటు అన్ని తెలుగు మీడియం పాఠశాలలను ఆంగ్ల మాధ్యమానికి మార్చి నిరుపేదలకు ఇంగ్లీష్ చదువులను చేరువ చేశారు. కార్పొరేట్ - ప్రతిపక్ష టీడీపీ లాబీ ఆంగ్ల మాధ్యమం వద్దని ఎంత నానా యాగీ చేసినా మొక్కవోని పట్టుదలతో పథకాన్ని అమలు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

కానీ జగన్ ఎంతో ఆశించి చేసిన ఈ పథకానికి ఇప్పుడు స్పందన కరువైందన్న చర్చ సాగుతోంది. దీనికి అధికారుల ప్రణాళిక లోపమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశం గర్వించే ‘రైతు బంధు’ పథకాన్ని అమలు చేసి రైతులకు ఎకరానికి రూ.4వేలను చెక్కుల రూపంలో పండుగ వాతావరణంలో అప్పట్లో అందజేశారు. ఎమ్మెల్యేల చేత స్వయంగా రైతులకు ఇప్పిందిచారు. అలా డైరెక్టుగా లబ్ధి చేకూరడంతో రైతులంతా గులాబీ పార్టీని తలుచుకొని ఓటేశారు. టీఆర్ఎస్ కు ఇది దేశ వ్యాప్తంగా ఎంత మైలేజ్ తెచ్చిపెట్టింది. ఈ రైతుబంధు పథకాన్ని ఏకంగా మోడీ కాపీ కొట్టి ‘కిసాన్ యోజన’తో పేరుతో అమలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు.

కానీ నేడు జగన్ ఈ ఇలా చెక్కుల రూపంలో ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తాను అనడంతో జగన్ సభలకు స్పందన కరువైంది. ఎలాగూ బ్యాంకుల్లో వేస్తారు కదా అని లబ్ధిదారులు ఎవరి పనిలో వారున్నారు. దీంతో జగన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. చెక్కుల రూపంలో ఇస్తే ప్రతీ లబ్ధిదారు జగన్ సభకు వచ్చి తీసుకొని ఆయన ఇచ్చిన భరోసాను గుర్తుంచుకునే వారు తలుచుకునేవారు. కానీ జగన్ సర్కారు అమ్మఒడి డబ్బులను ఖాతాల్లో వేస్తుండడంతో ఇక ఎందుకు సభకు రావడం అని మా డబ్బులు మా ఖాతాల్లో పడుతాయని అందరూ మిన్నకుండిపోతున్నారు. దీనిపై మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

ఇలా గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన జగన్ దాన్ని లబ్ధిదారులందరికీ చేరువయ్యేలా చేయడంలో విఫలమైందన్న చర్చ సాగుతోంది. చెక్కులిస్తే అందరూ జగన్ సభకు వచ్చి లేదా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తీసుకొని వైసీపీకి అభిమానులుగా మారిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడే జగన్ సర్కారు తప్పటడుగు వేసిందన్నచర్చ సాగుతోంది.