Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు వివేకా హత్యపై స్పందించిన సీఎం జగన్!

By:  Tupaki Desk   |   20 Nov 2021 10:11 AM IST
ఎట్టకేలకు వివేకా హత్యపై స్పందించిన సీఎం జగన్!
X
వైఎస్ వివేకానందరెడ్డి.. స్వయంగా ఏపీ సీఎం జగన్ కు బాబాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో ఆయన హత్య జరిగింది. ఇప్పటికీ ఈ హత్య ఒక మిస్టరీనే. ఎలా జరిగింది.? ఎవరు చంపారన్నది సీబీఐ శూలశోధన చేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ వివేకా హత్య విషయంలో సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ, చంద్రబాబు ఎన్నో ఆరోపణలు చేశారు. తాజాగా అసెంబ్లీని ఈ విషయం కుదిపేసింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం రెండు ప్రత్యేక సంఘటనలకు సాక్షిగా నిలిచింది. మొదటిది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టి ఇక తాను అసెంబ్లీకి తిరిగి రానని ప్రతిజ్ఞ చేశాడు. రెండవది, సీఎం జగన్ చివరకు తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై తొలిసారి స్పందించారు.

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ జరుగుతుండగా ప్రధాన అజెండా పక్కదారి పట్టడంతో అనూహ్య సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకున్నాయి.

చంద్రబాబు నిష్క్రమణ తర్వాత టీడీపీ విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం సీఎం జగన్‌కు లభించింది.

జగన్ మాట్లాడుతూ.. ''వివేకా నాకు బాబాయి, నాన్నకు రక్తం పంచుకుపుట్టిన సోదరుడు. అతని హత్య కేసులో నన్ను ఎందుకు లాగారు? ఇది ఎప్పుడు జరిగింది? సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలోనే వివేకా హత్యకు గురయ్యారు. కానీ గత ప్రభుత్వం ఎలాంటి విచారణ ప్రారంభించలేదు. అదే పార్టీ ఇప్పుడు మాపై నిందలు వేస్తోంది.

ఈ కేసుకు సంబంధించి ప్రముఖంగా వినిపిస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును ఎత్తిచూపుతూ.. ప్రతిపక్షాలు నా పేరును లాగడమే కాకుండా నా బంధువు అని అవినాష్‌రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు అని జగన్ సమాధానమిచ్చారు.

"కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు మనం సహజంగానే నిరుత్సాహానికి గురవుతాము. వివేకాను ఎమ్మెల్సీని చేయాలని మా పార్టీ ప్లాన్ చేసింది. అయితే చంద్రబాబు సీఎం కుర్చీలో ఉన్నప్పుడు ధనబలం, పరిపాలన, పోలీసు బలగం ఉపయోగించి ఆయన్ను ఓడించారు'' అని జగన్ అన్నారు.

టీడీపీ ఆరోపణలపై జగన్ ఎదురుదాడి చేస్తూ తమ పార్టీ వారి నుంచి నీతులు, సూక్తులు నేర్చుకునే స్థితిలో లేదని అన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలను షేక్ చేశాయి. ఎందుకంటే జగన్ తొలిసారి తన బాబాయి వివేకా హత్య గురించి మాట్లాడాడు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.