Begin typing your search above and press return to search.

వైరల్ న్యూస్..టీటీడీ బోర్డులో మైహోం అధినేత - దిల్ రాజు?

By:  Tupaki Desk   |   27 Aug 2019 3:54 PM GMT
వైరల్ న్యూస్..టీటీడీ బోర్డులో మైహోం అధినేత - దిల్ రాజు?
X
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కూర్పునకు సంబంధించి ఇప్పుడు ఓ వైరల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే... టీటీడీలో మొన్నటిదాకా తెలంగాణ తరఫున ఒకే ఒక సభ్యుడు కొనసాగగా... ఇప్పుడు ఏకంగా ముగ్గురికి చోటు దక్కనుందట. అంతేకాదండోయ్.. ఆ ముగ్గురిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ జూపల్లి రామేశ్వరరావుతో పాటు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజులు ఉన్నారని ఈ వార్తలు చెబుతున్నాయి. మై హోం రామేశ్వరరావేంటీ... టీటీడీ బోర్డులో సభ్యుడేంటీ? అని డౌటు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల వెంకన్న కార్యకలాపాలకు సంబంధించిన కీలక బోర్డులో సభ్యుడిగా కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. అలా మైహోం రామేశ్వరరావు టీటీడీ బోర్డులో సభ్యుడిగా చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా పదవీ ప్రమాణం చేశాక... అప్పటిదాకా టీటీడీ చైర్మన్ గా కొనసాగిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయగా... ఆ పదవిలో తన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. సుబ్బారెడ్డి నియామకాన్నిమాత్రమే చేపట్టిన జగన్... పూర్తి స్థాయి బోర్డును ఏర్పాటు చేయలేదు. సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీలో కాస్తంత నిదానంగానే వ్యవహరిస్తూ వస్తున్న జగన్... ఇప్పటికే పలు కీలక పదవులను భర్తీ చేశారు. ఈ క్రమంలోనే టీటీడీకి కూడా పూర్తి స్థాయి బోర్డును ఏర్పాటు చేసే దిశగా జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ కసరత్తులో భాగంగా తెలంగాణ నుంచి ఏకంగా ముగ్గురికి చోటు కల్పించేందుకు కూడా జగన్ ఓకే అన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ తో స్నేహపూరిత వైఖరితోనే ముందుకు సాగుతున్న కారణంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. కేసీఆర్ అభ్యర్థన మేరకే మైహోం రామేశ్వరరావుతో పాటు దిల్ రాజును టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తనతో పాటు కేసీఆర్ కూడా బాగా నమ్మే చినజీయర్ స్వామికి మైహోం రామేశ్వరరావు అత్యంత ఆప్తుడు కూడా. జీయర్ కూడా రామేశ్వరరావు తరఫున జగన్ కు ఓ మాట చెప్పి ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. అదే సమయంలో తాను బాగా విశ్వసించే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించే ఓ ప్రముఖుడికి కూడా జగన్ టీటీడీలో చోటు కల్పించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ... టీటీడీ బోర్డులో మైహోం రామేశ్వరరావు, దిల్ రాజులకు చోటు దక్కుతుందన్న వార్తలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.