Begin typing your search above and press return to search.

కరోనా దెబ్బకు విద్యా సంస్ధల మూసివేత

By:  Tupaki Desk   |   3 Jan 2022 12:08 PM IST
కరోనా దెబ్బకు విద్యా సంస్ధల మూసివేత
X
కరోనా వైరస్ తీవ్రత, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల కారణంగా విద్యాసంస్ధలను మూసేస్తున్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తికి విద్యా సంస్ధలు ప్రధాన హబ్ గా మారుతున్నాయన్న ఆందోళనతోనే ముందుజాగ్రత్తగా వివిధ రాష్ట్రాలు విద్యాసంస్ధలను మూసేస్తున్నాయి. మొదటి ఢిల్లీలో మూసేశారు. ఆ తర్వాత తమిళనాడులో పదిరోజుల పాటు విద్యాసంస్ధలను మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇపుడు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

ఒకటి రెండు రోజుల్లో మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు కూడా విద్యాసంస్ధల మూసివేత నిర్ణయం ప్రకటించబోతున్నాయని సమాచారం. ఎందుకంటే పై రెండు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత బాగా పెరిగిపోతోంది. నిజానికి ఇప్పటికే మహారాష్ట్ర విద్యా సంస్ధలను మూసేయాల్సింది. అయితే ఏ కారణంగా ఇంకా మూయలేదో అర్ధం కావటంలేదు. ఎందుకంటే దేశం మొత్తం మీద అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్ధానంలో ఉంది.

శుక్రవారం నుండి 24 గంటలల్లో మహారాష్ట్రలో దాదాపు 8 వేల కేసులు నమోదవ్వటం సంచలనంగా మారింది. మొత్తం కేసుల్లో సుమారు 5 వేల కేసులు ఒక్క ముంబాయ్ లో మాత్రమే రికార్డయ్యాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే ముంబయ్ లో చాలారోజులుగా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఒకవైపు కర్ఫ్యూ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయంటేనే పరిస్దితి చేయిదాటిపోతోందని అర్ధమవుతోంది. మంత్రులు, ఎంఎల్ఏలు 35 మందికి కరోనా సోకటమే పరిస్ధితికి అద్దం పడుతోంది.

ఇక బెంగుళూరులో పరిస్దితులు దాదాపు ఇలాగే ఉంది. ఇక్కడ కూడా కేసుల తీవ్రత పెరిగిపోతున్నది. రాష్ట్రమంతా ఒకఎత్తు బెంగుళూరు ఒకఎత్తన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఇక్కడ కూడా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో విద్యాసంస్ధల మూసివేసే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. విద్యాసంస్ధల్లో ఎవరికైనా కరోనా సోకితే అది చాలా స్పీడుగా పాకిపోతుందని ప్రభుత్వం ఆందోళన పడుతోంది. అందుకనే తొందరలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఇదే దారిలో తెలంగాణా ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.