Begin typing your search above and press return to search.

జగన్ కు తలనొప్పిగా మారుతున్న ఆధిపత్య పోరు!

By:  Tupaki Desk   |   3 March 2020 1:15 PM IST
జగన్ కు తలనొప్పిగా మారుతున్న ఆధిపత్య పోరు!
X
అత్యధిక స్థానాలతో అపూర్వ విజయం సాధించి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర పగ్గాలు అందుకున్నాడు. విజయవంతంగా పాలన సాగిస్తూ తనదైన పాలనతో దూసుకెళ్తున్న జగన్ కు పార్టీలోని ఆధిపత్య పోరు తలనొప్పిగా మారింది. అధికారంలోకి తొమ్మిది నెలలు గడుస్తోంది. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య సమన్వయం లేక.. వర్గపోరు బహిర్గతమవుతోంది. సొంత పార్టీ నాయకులే ఒకరిపై ఒకరు తమ బలాబలాలు నిరూపించుకుంటూ జిల్లాల్లో తమ ప్రాబల్యం చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే విబేధాలు బయటపడుతూ అధికార పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఈ పరిణామాలు అనంతపురము, కర్నూల్ జిల్లాలతో పాటు తాజాగా ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.

2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉండగా వైఎస్సార్సీపీ 8 స్థానాలు విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఒక ఒంగోలు పార్లమెంట్ స్థానం కూడా వైఎస్సార్‌సీపీ కి దక్కిందే. అద్భుత ఫలితాలు సాధించి జిల్లాలో ఆ పార్టీ బలీయమైన శక్తి నిలవగా.. ఇప్పుడు అదే ఆ పార్టీ కొంప ముంచుతోంది. గెలిచిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు స్థానిక నాయకులతో సక్రమంగా ఉండడం లేదని, స్థానిక నాయకులు తమకు సహకరించడం లేదని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండుగా చీలినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఖరి తోనే పార్టీలో విబేధాలు మొదలయ్యాయి.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీ లో చేరాడు. ఆ సమయంలో వైవీ సుబ్బారెడ్డి పై ఒంగోలు పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అనంతరం పరిణామాలు మారాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్సీపీ లో చేరారు. చేరి ఒంగోలు ఎంపీగా గెలిచారు. అయితే ఎంపీగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేల తో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పడడం లేదు. ఎమ్మెల్యేల మధ్య ప్రతి చిన్న విషయంలో పంతాలు పెరిగి పోతున్నాయని తెలుస్తోంది. దీంతో వైఎస్సార్సీపీ పార్టీలో సమన్వయం లోపిస్తోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ విబేధాలు పార్టీ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.